కాబూల్: అమెరికా ఎయిర్ఫోర్స్కు చెందిన విమానంలో ఏకంగా 640 మంది ఆఫ్ఘన్లు ప్రయాణించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తాలిబన్ల పాలనకు భయపడి దేశం విడిచి వెళ్లిపోవడానికి కొన్ని వేల మంది ఆఫ్ఘన్లు సోమవారం కాబూల్ ఎయిర్పోర్ట్కు పోటెత్తిన విషయం తెలుసు కదా. అక్కడ కనిపించిన ప్రతి విమానంలోకి వీళ్లు ఎక్కి కూర్చున్నారు. అలా అమెరికన్ ఎయిర్ఫోర్స్కు చెందిన సి-17 ఎయిర్క్రాఫ్ట్లో కూడా ఎక్కారు. ఇదొక కార్గో విమానం. అలాంటి విమానంలో ఏకంగా 640 మంది ఎక్కారు. అంతమందిని తీసుకెళ్లే ఉద్దేశం తమకు లేకపోయినా.. ఆఫ్ఘనిస్తాన్( Afghanistan )లో నెలకొన్న భయానక పరిస్థితుల నేపథ్యంలో తాము ఎవరినీ కిందికి దించలేదని అమెరికా రక్షణ అధికారులు వెల్లడించారు.
అలా ఆ 640 మందిని తీసుకెళ్లి ఖతార్లో దించారు. సి-17 కార్గో విమానం గతంలో ఎప్పుడూ ఇంత మందిని ఒకేసారి మోసుకెళ్లలేదు. అసలు ఈ విమానం రన్వేపై ల్యాండవుతుండగానే వందలాది మంది దాని వెంట పరుగులు తీశారు. లోపలికి వెళ్లలేని వాళ్లు విమానం టైర్లను పట్టుకొని కూర్చున్నారు. అలా వెళ్లిన వాళ్లలో విమానం పైకి ఎగరగానే ముగ్గురు కింద పడి ప్రాణాలు కోల్పోయారు.