హేగ్: నెదర్లాండ్స్కు చెందిన వైద్య పరికరాల సంస్థ ఫిలిప్స్ ప్రపంచవ్యాప్తంగా ఆరు వేల ఉద్యోగులను తొలగించనున్నది. ఆ కంపెనీ సీఈవో రాయ్ జాకబ్స్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఇది కష్టతరమైన సమయమని, కానీ 2025 నాటికి ఉద్యోగుల్ని తగ్గించనున్నట్లు ఆయన తెలిపారు. మూడు నెలల క్రితమే నాలుగు వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఇటీవల ఆ సంస్థ తయారు చేసిన స్లీప్ రెస్పిరేటర్లపై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో భారీ స్థాయిలో ఆ పరికరాలను రికాల్ చేశారు.
అమ్స్టర్డామ్కు చెందిన ఫిలిప్స్ కంపెనీ గత ఏడాది నాలుగవ త్రైమాసికంలో సుమారు 114 మిలియన్ల డాలర్ల నష్టాన్ని చవిచూసింది. గత ఏడాది మొత్తం ఆ కంపెనీ సుమారు 1.605 బిలియన్ల యూరోలు నష్టపోయినట్లు అంచనా వేస్తున్నారు. స్పలీప్ రెస్పిరేటర్ల పరికరాలను రీకాల్ చేయడం వల్ల ఆ నష్టం వచ్చినట్లు భావిస్తున్నారు. నిద్రలేమి సమస్యతో బాధపడేవారి కోసం తయారు చేసిన రెస్పిరేటర్లలో నాణ్యత లోపం వచ్చింది. అమెరికాలో ఆ ఉత్పత్తిపై పలు కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ పరికరాన్ని రీకాల్ చేశారు.
2023లోనే మూడు వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు జాకబ్స్ తన ప్రకటనలో తెలిపారు. 130 ఏళ్ల క్రితం బల్బుల కంపెనీగా ప్రారంభమైన ఆ సంస్థ ఇప్పుడు హై ఎండ్ హెల్త్కేర్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్ని తయారు చేస్తోంది.