Philippines : సోషల్ మీడియాలో వీడియోలు, లైకులు, కామెంట్ల కోసం కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్తితి. తాజాగా ఫిలిప్పీన్స్కు చెందిన ఒక మహిళ ఇలా సోషల్ మీడియా కోసం వీడియో తీసి, ప్రాణాలు కోల్పోయింది. వీడియో కోసం విషపూరిత పీతలు తిని మరణించినట్లు న్యూయార్క్ పోస్ట్ మీడియా సంస్థ తెలిపింది.
ఫిలిప్పీన్స్, ప్యూర్టో ప్రిన్సెసా, పలావాన్ ప్రాంతానికి చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ఫుడ్ వ్లాగర్ అయిన ఎమ్మా అమిత్ అనే (51) మహిళ దగ్గర్లోని ఒక నదిలో డెవిల్ క్రాబ్స్ను పట్టుకుంది. డెవిల్ క్రాబ్స్ రకం పీతలు చాలా విషపూరితమైనవి. వీటిని ఎవరూ తినరు. ఆ విషయం కూడా ఆమెకు తెలుసు. అయితే, తను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేందుకు వీడియో రూపొందించడం కోసం ఈ పీతల్ని తిన్నది. టిక్టాక్, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం కోసం ఈ పీతల్ని పట్టుకుని, కొబ్బరి పాలతో కలిపి ఫిబ్రవరి 4న వంట చేసుకుని తిన్నది. అయితే, ఆ మరుసటి రోజే ఆమె తీవ్ర అనారోగ్యం పాలైంది. మూర్ఛ రావడం, పెదవులు నీలి రంగులోకి మారడంతోపాటు స్పృహ కోల్పోయింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో ఎమ్మా ఈ నెల 6న ఆస్పత్రిలో మరణించింది.
ఆమె మరణంపై స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎమ్మా, ఆమె భర్త తీర ప్రాంతంలోనే ఉంటారని, వారికి చేపలు, ఇతర సీ ఫుడ్ గురించి బాగా తెలుసని వారు అంటున్నారు. ఇంత అవగాహన ఉన్నా కూడా ఆమె డెవిల్ క్రాబ్స్ను ఎందుకు తిన్నదో అని విస్మయం వ్యక్తం చేశారు. వీటిని వండినంత మాత్రాన అందులోని విషం తొలగిపోదని, ఇవి తింటే పక్షవాతం రావడంతోపాటు ప్రాణాలు కూడా పోతాయని వారు అంటున్నారు. ఏదేమైనా ఒక వీడియో కోసం ఎమ్మా అమిత్ విషాహారం తిని ప్రాణాలు కోల్పోయింది.