వాషింగ్టన్ : అమెరికా ఫార్మా దిగ్గజం శుభవార్త చెప్పింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్కు వ్యతిరేకంగా వ్యాక్సిన్ కోసం క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించినట్లు ఫైజర్ – బయో ఎన్టెక్ ప్రకటించింది. 18-55 సంవత్సరాల మధ్య వయసు ఉన్న 1,420 మంది అభ్యర్థులపై ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత వారిని పరీక్షించి.. వచ్చే ఫలితాల ఆధారంగా వ్యాక్సిన్ సమర్థతను అంచనా వేయనున్నారు.
మూడు విడుతల్లో క్లినికల్ ట్రయల్స్ జరుగనుండగా.. ఇప్పటికే మూడు నెలల ముందుగా రెండు డోసులు తీసుకున్న కొందరిపై, అలాగే బూస్టర్ డోసు తీసుకున్న మరికొందరితో పాటు.. ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకోని వ్యక్తులను మూడు కేటగిరిలుగా విభజించి ట్రయల్స్ నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా.. ఒమిక్రాన్ గతంలో వచ్చిన వేరియంట్ల కంటే అంత ప్రమాదకరమైంది ఏం కాకపోయినప్పటికీ.. భవిష్యత్లో వచ్చే కొత్త వేరియంట్లను ఎదుర్కొనేందుకు ఫైజర్ – బయో ఎన్టెక్ కంపెనీ వ్యాక్సిన్ను సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తున్నది.
ఇప్పటికే ఒమిక్రాన్ను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ను వచ్చే మార్చి నాటికి అందుబాటులోకి తీసుకువస్తామని ఇంతకు ముందు కంపెనీ సీఈవో ప్రకటించారు. అమెరికాకు చెందిన ఫైజర్ కంపెనీ జర్మనీకి చెందిన బయో ఎన్టెక్ కంపెనీతో కలిసి కొవిడ్ టీకాను తయారు చేసింది. ఆర్ఎన్ఏ సాంకేతిక ఆధారంగా రెండు కంపెనీలు సంయుక్తంగా వ్యాక్సిన్ను తయారు చేశాయి.