లండన్: సుదీర్ఘ కాలం కోవిడ్(Long Covid) లక్షణాలతో బాధపడుతున్న వారిలో.. సమస్యలు తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. లాండ్ కోవిడ్తో ఉన్న వారిలో అవయవాలు ఎక్కువగా దెబ్బతింటున్నట్లు గుర్తించారు. కొత్త అధ్యయనానికి చెందిన రిపోర్టును రిలీజ్ చేశారు. ఎంఆర్ఐ స్కానింగ్ల ద్వారా ఈ విషయాలు బయటపడ్డాయి. సుదీర్ఘ కాలం కోవిడ్తో బాధపడుతున్న వారిలో.. ఊపరితిత్తులు, మెదడు, కిడ్నీలు దెబ్బతింటున్నట్లు ఎంఆర్ఐ స్కానింగ్ల ద్వారా నిర్ధారణకు వచ్చారు. లాంగ్ కోవిడ్కు.. తీవ్ర ఆరోగ్య సమస్యలకు లింకు ఉన్నట్లు గుర్తించారు.
కొత్త స్టడీకి చెందిన నివేదికను లాన్సెట్ రెస్పిరేటరీ మెడిసిన్లో ప్రచురించారు. సుమారు 259 మంది రోగులపై ఆ స్టడీ చేశారు. కరోనా వైరస్ సోకి ఆస్పిటల్ చికిత్స పొందిన వారిలో అవయవాలు దెబ్బతింటున్న సమస్య అధికంగా ఉన్నట్లు గుర్తించారు. డిశార్చ్ అయి 5 నెలలు గడిచిన వారికి నిర్వహించిన ఎంఆర్ఐ స్కానింగ్ ద్వారా చాలా తేడాను పసికట్టారు. కోవిడ్ రాని 52 మందితో ఆ తేడాలను పోల్చారు.
అత్యధికంగా ఊపిరితిత్తులపై ప్రభావం ఉన్నట్లు గుర్తించారు. ఊపిరితిత్తుల్లో సుమారు 14 శాతం అధికంగా డ్యామేజ్ జరిగినట్లు తేల్చారు. బ్రెయిన్లోనూ సమస్యలు మూడింతలు అధికంగా ఉన్నట్లు ఎంఆర్ఐ స్కానింగ్ ద్వారా గుర్తించారు. ఇక కిడ్నీల్లో ఆ సమస్యలు రెండింతలు ఉన్నట్లు తేల్చారు. లాంగ్ కోవిడ్తో బాధిపడినవారి గుండెకు కానీ కాలేయానికి కానీ ఎటువంటి మార్పులు లేవని నిర్ధారణకు వచ్చారు.
సుదీర్ఘ కాలం కోవిడ్ లక్షణాలతో బాధపడుతన్న వారిలో కచ్చితంగా ఏదో ఒక అవయవం దెబ్బతింటోందని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ బెట్టి రామన్ తెలిపారు.