వాషింగ్టన్, అక్టోబర్ 21: మనలో మానసిక ఒత్తిడికి, ఆందోళనకు, మనం తిండి తినే సమయానికి సంబంధం ఉంటుందట. పగటి పూట భోజనం చేసేవారితో పోలిస్తే రాత్రి పూట భోజనం చేసేవారికి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయని ఓ అధ్యయనం స్పష్టం చేసింది. ప్రత్యేకించి రాత్రి పూట భోజనం చేసేవారిలో మానసిక ఒత్తిడి, ఆందోళన అధికంగా ఉంటుందని వెల్లడించింది.
పూర్తిగా పగటి పూట భోజనం చేసేవారితోపాటు పగలు, రాత్రి రెండు పూటలూ భోజనం చేసే అలవాటున్నవారిపై జరిపిన ఈ అధ్యయన వివరాలు ‘ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’ జర్నల్లో ఇటీవల ప్రచురితమయ్యాయి. పగటి పూట భోజనం చేసేవారితో పోలిస్తే రాత్రి పూట భోజనం చేసేవారిలో మానసిక ఒత్తిడి 26%, ఆందోళన 16% అధికంగా ఉంటుందని ఈ అధ్యయనం తేల్చింది. కేవలం పగటి పూట మాత్రమే భోజనం చేసేవారిలో మానసిక ఒత్తిడి, ఆందోళన పెరుగుదల ఇంత స్థాయిలో ఉండదని పేర్కొన్నది.