ఇమ్రాన్ ప్రభుత్వం అవిశ్వాసాన్ని ఎదుర్కోబోతోందన్న వార్తల నేపథ్యంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాక్ ప్రజలకు ఓ విజ్ఞప్తి చేశారు. పాక్ ప్రజలందరూ తమ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని పాక్ అధికారిక పత్రిక డాన్ పేర్కొంది. సైదూ షరీఫ్ మైదానంలో జరిగిన సభకు ఇమ్రాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగానే ఆయన ఈ విజ్ఞప్తి చేశారు. ఇస్లామో ఫోబియాను విషయంలో తాను ఐక్యరాజ్యసమితిలో ఓ తీర్మానాన్ని ప్రవేశపెడితే… దీనికి అనుగుణంగా మార్చి 15 న ఇస్లామోఫోబియా వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుతున్నారని అన్నారు.
ఇస్లామీ ఫోబియా గురించి మాట్లాడడానికే ఏ నేత కూడా సాహసించే వారు కాదని, మాజీ ప్రధాని కూడా మాట్లాడేవారు కాదని విమర్శించారు. వారందరూ పశ్చిమ దేశాలకు బానిసలంటూ ఇమ్రాన్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాలు దేశాన్ని దోచుకుంటున్నాయని, జాతీయ జవాబుదారీ బ్యూరోను అంతం చేయడానికి చూస్తున్నారని ఆరోపించారు. ఎందుకంటే వారు చేసిన అవినీతిపై విచారణ జరుగుతుందన్న భయంతోనే ఇలా చేస్తున్నారని అన్నారు. డబ్బులతో ప్రజా ప్రతినిధులను కొనాలని చూస్తున్నారని, దీనిపై ఎన్నికల సంఘం ఓ దృష్టి సారించాలని ఇమ్రాన్ విజ్ఞప్తి చేశారు.