సాధారణంగా నులిపురుగుల (Prasitic worms) సమస్య చిన్నపిల్లల్లో కనిపిస్తుంది. అరుదుగా కొంతమంది పెద్దవాళ్లను కూడా ఈ సమస్య బాధపెడుతుంది. అయితే, మనిషి జీర్ణవ్యవస్థలో నులిపురుగులు కనిపించడం అనేది సాధారణ విషయమే. కానీ, మనిషి చర్మం కింద నులిపురుగులు చేరి నరాల్లా ఉబ్బి కనిపించడమే అంతుచిక్కని విషయం. వియత్నాంకు చెందిన ఓ మహిళలో ఇటీవల ఈ వింత సమస్య కనబడింది. చర్మం కిందనే కాదు, ఆ మహిళ మెదుడులో కూడా నులిపురుగులు గూడు కట్టుకుని ఉన్నాయి. మరి ఆమెకు ఆ సమస్య ఎందుకొచ్చింది..? సమస్య నుంచి ఆమె ఎలా బయటపడింది..? అనే వివరాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం..
తలనొప్పితో ఆస్పత్రికి..
వియత్నాం దేశం హనోయ్ నగర శివార్లలోని ఆన్ బిన్హ్ ప్రాంతంలో 58 ఏళ్ల మహిళ కుటుంబంతో కలిసి నివసిస్తున్నది. అయితే, ఇటీవల ఆమె తనలో వింత సమస్యను గుర్తించింది. ఆమె కాళ్లు, చేతుల చర్మం కింద అక్కడక్కడ నరాల మాదిరిగా ఉబ్బులు తేలాయి. కానీ, వాటివల్ల ఎలాంటి సమస్య అనిపించకపోవడంతో ఆమె పట్టించుకోలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆమెలో తీవ్రమైన తలనొప్పి వచ్చింది. అనంతరం వంట చేస్తూనే పడిపోవడం మొదలైంది.
బ్రెయిన్ స్ట్రోక్ అనుకుని..
అలా పలుమార్లు జరగడంతో కుటుంబసభ్యులు ఆమెను స్థానికంగా ఉన్న డాంగ్ వాన్ ఎంగు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు బ్రెయిన్ స్ట్రోక్ వల్లే సమస్య వచ్చిందని ముందుగా భావించారు. అయితే, స్కానింగ్ చేసి చూడటంతో ఆమె నులిపురుగుల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లు తేలింది. ఆ నులిపురుగులే ఆమె చర్మం కింద చేరి, నరాల్లా ఉబ్బుతున్నాయని గుర్తించారు. ఆమె మెదడులోనూ నులిపురుగులు కుప్పలుకుప్పలుగా గూడు కట్టుకుని ఉండటం చూసి ఆశ్చర్యపోయారు.
టైట్ క్యాన్ వల్లేనని నిర్ధారణ..
ఆఖరికి శస్త్రచికిత్స చేసి మెదడు, కాళ్లు, చేతుల్లో ఉన్న నులిపురుగులను తొలగించారు. ప్రస్తుతం ఆ మహిళకు ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు తెలిపారు. కొన్ని రోజులకు సరిపడా మందులు రాసిచ్చి ఇంటికి పంపారు. అయితే, సమస్య ఎందుకు వచ్చిందనే కోణంలో వైద్యులు పరిశీలన చేశారు. బాధితురాలి ఆహారపు అలవాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. దాంతో ఆమె తనకు ఎంతో ఇష్టమైన, రుచికరమైన ‘టైట్ క్యాన్’ అనే ఆహార పదార్థం గురించి చెప్పింది.
తాను నెలకు ఒక్కసారైనా టైట్ క్యాన్ను ఆహారంగా తీసుకుంటానని వైద్యులకు తెలిపింది. అయితే ఈ ‘టైట్ క్యాన్’ అనే రెసిపీని జంతువుల పచ్చి రక్తం, ఉడికించిన మాంసంతో తయారు చేస్తారు. దాంతో ఆ పచ్చిరక్తం ద్వారానే సదరు మహిళ శరీరంలోకి నులిపురుగులు ప్రవేశించాయని వైద్యులు నిర్ధారించారు. పచ్చి రక్తంలో ఉన్న నులిపురుగులు ఆమె శరీరంలోకి చేరి విరివిరిగా సంతానోత్పత్తి చేసుకున్నాయని, అందుకే ఎక్కడపడితే అక్కడ పురుగుల గూళ్లు ఏర్పడ్డాయని చెప్పారు.