ప్రధాని ఇమ్రాన్కు ఝలక్ తగిలింది. ముత్తహిదా ఖ్వామీ మూవ్మెంట్ పాకిస్తాన్ (ఎంక్యూఎం) పార్టీ ప్రతిపక్షాలతో చేతులు కలిపింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేతలందరూ కలిసి ఉమ్మడిగా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా విపక్ష నేత షహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. ప్రజల గొంతును, ఆకాంక్షలను అర్థం చేసుకొని, ఎంక్యూఎం ఈ నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజు నుంచి పాక్లో అందరం కలిసి ఓ కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నామని వ్యాఖ్యానించారు. ఇక ప్రధాని పదవిలో ఇమ్రాన్కు కొనసాగే అర్హత లేదని, ఆయన రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.
ఇక పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నేత బిలావల్ భుట్టో మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు చూపుతున్న ఈ సంఘీభావం కచ్చితంగా అభినందనీయమని కొనియాడారు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి, ఎంక్యూఎంకి మధ్య బంధం చాలా పాతది అని అన్నారు. ఇకపై ప్రతి విషయంలోనూ ఇద్దరమూ కలిసి ముందుకు సాగుతామని కీలక ప్రకటన చేశారు. అందరమూ కలిసి కరాచీతో సహా మొత్తం పాకిస్తాన్ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఎప్పటి నుంచో ఇరు పక్షాలు కలిసి ముందుకు సాగాలని ఉండేదని, కానీ ఇప్పుడు సాకారమైందని హర్షం వ్యక్తం చేశారు.
2018 లో జరిగిన ఎన్నికలు అంతా ఓ కుట్రేనని బిలావల్ ఆరోపించారు. ఈ కుట్ర కారణంగానే ఇరు పక్షాల మధ్య సంబంధాలు తెగిపోయాయని, దాని ఫలితాలను ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలు అనుభవించాల్సి వస్తుందని బిలావల్ భుట్టో అన్నారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ కచ్చితంగా రాజీనామా చేయాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు. మరింత కాలం కొనసాగే అర్హత ఆయనకు లేదని మండిపడ్డారు. రేపే పార్లమెంట్ సమావేశాలున్నాయని, అక్కడే అంతా తేల్చుకోవాలని బిలావల్ నొక్కి చెప్పారు.