ఇస్లామాబాద్, ఏప్రిల్ 28: వ్యక్తులకు, సంస్థలకు వడ్డీలేని రుణాలు ఇచ్చేలా బ్యాంకింగ్ చట్టాల్లో సవరణలు చేయాలని పాకిస్థాన్ ప్రభుత్వాన్ని ఫెడరల్ షరియట్ కోర్టు (ఎఫ్ఎస్సీ) గురువారం ఆదేశించింది. 2027 డిసెంబర్ నాటికి వడ్డీరహిత బ్యాంకింగ్ వ్యవస్థ అమల్లోకి తీసుకురావాలని స్పష్టంచేసింది.
దేశంలోని ప్రస్తుత బ్యాంకింగ్ వ్యవస్థ షరియా చట్టానికి వ్యతిరేకంగా ఉన్నదని వెల్లడించింది. ‘ఇస్లామిక్ బ్యాకింగ్ వ్యవస్థ వేధింపులకు, బెదిరింపులకు దూరంగా ఉంటుంది. అయితే, రెండు దశాబ్దాలు గడిచినప్పటికీ, బ్యాంకింగ్ రంగంలో కొనసాగుతున్న వడ్డీల విధింపుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’ అని జస్టిస్ డాక్టర్ సయ్యద్ ముహమ్మద్ అన్వర్ అన్నారు. బ్యాంకు నుంచి తీసుకొన్న అసలుతో పోలిస్తే వడ్డీనే ఎక్కువగా ఉంటున్నట్టు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్న పాక్ ప్రభుత్వానికి కోర్టు తాజా ఆదేశాలు ఇబ్బందులు కలిగించవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.