లాహోర్ : ఆన్లైన్ గేమ్ పబ్ జీకి బానిసైన ఓ మైనర్ తన తల్లితో పాటు ముగ్గురు తోబుట్టువులను తుపాకీతో కాల్చి చంపాడు. ఈ దారుణ ఘటన పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో కొద్ది రోజుల క్రితం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
నహీద్ ముబారక్(45) అనే మహిళ హెల్త్ వర్కర్గా విధులు నిర్వర్తిస్తోంది. ఆమెకు కుమారుడు తైమూర్(22), 17, 11 ఏండ్ల వయసున్న ఇద్దరు కూతుళ్లతో పాటు మరో మైనర్ ఉన్నాడు. వీరిలో మైనర్ బాలుడు పబ్ జీ గేమ్లో మునిగిపోయాడు. ఎల్లప్పుడూ పబ్ జీ మాయలో ఉండిపోవడం తల్లికి నచ్చక మందలించింది. పబ్ జీ గేమ్లో మునిగిపోయిన అతనికి మానసిక సమస్యలు కూడా ఏర్పడ్డాయి. దీంతో అతను ఏం చేస్తున్నాడో అతనికే తెలియకుండా పోయింది.
నహీద్ ముబారక్ తన భర్తతో విడాకులు తీసుకున్నది. ఈ నేపథ్యంలో కుటుంబ భారం మొత్తం ఆమెపై పడింది. ఈ క్రమంలో బాగా చదువుకోవాలని, ఆన్లైన్ గేమ్స్కు దూరంగా ఉండాలని తన మైనర్ అబ్బాయికి పలుమార్లు చెప్పింది. ఇటీవల ఒక రోజు అతన్ని తల్లి తీవ్రంగా దూషించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాధిత బాలుడు కప్బోర్డులో ఉన్న తుపాకీని తీసుకుని, నిద్రిస్తున్న తల్లి, సోదరుడితో పాటు ఇద్దరు అమ్మాయిలపై కాల్పులు జరిపాడు. ఈ నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఇక ఆ మరుసటి రోజు కాల్పులు జరిపిన బాలుడు గట్టిగా అరవడంతో.. స్థానికులు వచ్చారు. ఇంట్లో అందరూ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసి షాకయ్యారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. కాల్పులకు ఉపయోగించిన తుపాకీని స్థానిక డ్రైనేజీలో బాలుడు పడేశాడు. దాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.