వాషింగ్టన్, అక్టోబర్ 15: పాకిస్థాన్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశాలలో ఒకటని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. ఇతర దేశాలతో ఎలాంటి సమన్వయం లేకుండా పాక్ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని అన్నారు. డెమోక్రటిక్ పార్టీ ప్రచార కమిటీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో మార్పులు చేసుకుంటున్న నేపథ్యంలో బైడెన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పాక్ అణ్వాయుధాలపై పశ్చిమ దేశాలు ఇప్పటికే ఆందోళన వ్యక్తంచేశాయి. ఆ అణ్వాయుధాలు ఉగ్రవాదులు లేదా జిహాదీ శక్తుల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉందని అవి అనుమానం వ్యక్తంచేస్తున్నాయి. పాకిస్థాన్ 1998లో అణు పరీక్షలు జరుపుతున్న నాటి నుంచి అమెరికా అధ్యక్షులు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు.