ఇస్లామాబాద్: బాలీవుడ్ లెజెండ్స్ రాజ్కపూర్, దిలీప్ కుమార్ల పూర్వీకులకు చెందిన ఇళ్లను మ్యూజియాలుగా మార్చాలని నిర్ణయించింది పాకిస్థాన్లోని ఖైబర్ పక్తూంక్వా ప్రావిన్స్ ప్రభుత్వం. దీనికోసం ముందుగా వాటిని కొనుగోలు చేయనుంది. దీనికి ఆ రెండు ఇళ్ల యజమానులు అభ్యంతరం వ్యక్తం చేసినా.. పెషావర్ జిల్లా కమిషనర్ ఖాలిద్ మెహమూద్ మాత్రం వాటిని తోసిపుచ్చారు. వాటికి ఎంత చెల్లిస్తామో ప్రకటించి.. యాజమాన్యాన్ని పురావస్తు శాఖకు మార్చారు. ఈ రెండు ఇళ్లు ఇక నుంచి పురావస్తు, మ్యూజియాల శాఖ డైరెక్టర్ పేరు మీద ఉంటాయని డిప్యూటీ కమిషనర్ కార్యాలయం స్పష్టం చేసింది.
దీనికోసం రాజ్కపూర్ ఇంటికి రూ.1.5 కోట్లు, దిలీప్ కుమార్ ఇంటికి రూ.80 లక్షలు చెల్లించనున్నట్లు ఖైబర్ పక్తూంక్వా ప్రభుత్వం ప్రకటించింది. రాజ్కపూర్ ఇల్లు 6.25 మార్లాలు (ఒక మార్లా=25.29 చదరపు మీటర్లు), దిలీప్కుమార్ ఇల్లు 4 మార్లాలు ఉంది. ఈ రెండు ఇళ్లకు ప్రస్తుతం వేర్వేరు యజమానులు ఉన్నారు. ఇందులో కపూర్ హవేలీ ఓనర్ అయిన అలీ ఖాదిర్ రూ.20 కోట్లు డిమాండ్ చేయగా.. దిలీప్కుమార్ ఇంటి ఓనర్ గుల్ రెహమాన్ రూ.3.5 కోట్లు అడిగాడు. అయితే ప్రభుత్వం మాత్రం రెండు ఇళ్లకూ కలిపి రూ.2.3 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించి, ఆ డబ్బును గత నెలలోనే పెషావర్ డిప్యూటీ కమిషనర్కు ట్రాన్స్ఫర్ చేసింది.
సినిమా రంగానికి రాజ్కపూర్, దిలీప్ కుమార్ చేసిన సేవలు భావితరాలు గుర్తించే విధంగా ఈ మ్యూజియాలను తీర్చిదిద్దుతామని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. కపూర్ హవేలీని 1918-1922 మధ్య నిర్మించారు. రాజ్కపూర్ తాత దివాన్ బషేశ్వర్నాథ్ కపూర్ దీనిని నిర్మించాడు. రాజ్కపూర్ జన్మించింది ఈ భవనంలోనే కావడం విశేషం. దీనిని జాతి వారసత్వ సంపదగా అక్కడి ప్రభుత్వం గుర్తించింది. దిలీప్కుమార్కు చెందిన 100 ఏళ్ల కిందట భవనం కూడా రాజ్కపూర్ ఇంటి సమీపంలోనే ఉంది. 2014లో అప్పటి నవాజ్ షరీఫ్ ప్రభుత్వం ఈ బిల్డింగ్ను వారసత్వ సంపదగా గుర్తించింది. ఈ రెండు ఇళ్లను కూలగొట్టి.. అక్కడ వాణిజ్య సముదాయం నిర్మించడానికి రెండు ఇళ్ల యజమానులు ప్రయత్నించారు.