Pakistan Elections | ఇస్లామాబాద్: హంగ్ ప్రభుత్వం దిశగా పాకిస్థాన్ అడుగులేస్తున్నది. గురువారం జరిగిన పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్కు ఏ పార్టీ చేరుకోలేదు. దీంతో ఇక్కడ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుతో గెలిచిన ఇండిపెండెంట్లు ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. దీంతో అధికారం కోసం మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ మిగతా పార్టీలు, ఇండిపెండెంట్ల మద్దతు కూడగట్టడానికి ప్రయత్నిస్తున్నారు.
శుక్రవారం కడపటి వార్తలందేసరికి 224 జాతీయ అసెంబ్లీ సీట్ల ఎన్నికల ఫలితాలు వెలువడగా, అందులో ఇమ్రాన్ మద్దతు ఇండిపెండెంట్లు 92 మంది విజయం సాధించారు. మూడుసార్లు ప్రధానిగా చేసిన నవాజ్ షరీఫ్కు చెందిన పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్)కు 63, బిలావల్ భుట్టో జర్దారీకి చెందిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ)కి 50, మిగిలిన చిన్న పార్టీలు 19 సీట్లను గెల్చుకున్నాయి. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలోని 336 స్థానాల్లో 265 స్థానాలకు (అభ్యర్థి మరణంతో ఒకటి వాయిదా పడింది) ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు జరిగాయి. పాక్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కనీసం 133 సీట్లు సాధించాలి. మరోవైపు, తమ పార్టీకి మెజార్టీ రాకపోయినప్పటికీ, తమదే విజయమంటూ నవాజ్ షరీఫ్ పేర్కొన్నారు. ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్ పునర్నిర్మాణానికి విపక్ష పార్టీలు కలిసి రావాలని మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పిలుపునిచ్చారు.