ఇస్లామాబాద్: మహ్మద్ ప్రవక్త జయంతి వేళ జరిగిన ఆత్మాహుతి దాడిల్లో (Suicide blasts) మృతుల సంఖ్య 65కు చేరింది. ఈద్ మిలాదున్ నబీ సందర్భంగా బలూచిస్థాన్ (Balochistan) రాష్ట్రంలోని మస్తుంగ్ (Mastung) జిల్లాలోని మదీనా మసీదు (Mosque) వద్ద స్థానికులు గుమికూడారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. దీంతో ఇప్పటివరకు 60 మంది మరణించారు. మరో 60 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత గంటల వ్యవధిలోనే ఖైబర్ ఫఖ్తుంఖ్వా (Khyber Pakhtunkhwa) రాష్ట్రంలోని హంగూ నగరంలో (Hangu city) మరో పేలుడు సంభవించింది. దీంతో ఐదుగురు మరణించారు. ఈ రెండు పేలుళ్లలో మృతుల సంఖ్య 65కు పెరిగింది. రెండు చోట్లా పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
కాగా, వరుస పేలుళ్ల ఘటనలో భారత్ (India) హస్తం ఉందని పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి సర్ఫ్రాజ్ బగ్టీ (Sarfaraz Bugti) అన్నారు. బలూచిస్థాన్ రాజధాని క్వెట్టాలో పర్యటించిన ఆయన ఈ రెండు పేలుళ్ల వెను భారత నిఘా విభాగమైన రా (RAW) పాత్ర ఉన్నదని ఆరోపించారు. దీనిపై తమ దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయన్నారు. మస్తుంగ్ ఆత్మాహుతి దాడిని ప్రతిఒక్కరు ఖండిచాలని పిలుపునిచ్చారు. ఆత్మాహుతి దాడికి సంబంధించి ఇప్పటివరకు ఏ సంస్థా బాధ్యతవహిస్తున్నట్లు ప్రకటించుకోలేదు. అయితే పాకిస్థాన్లో తెహ్రీక్-ఐ-తాలిబన్ పాకిస్థాన్ (TTP) ఉగ్రసంస్థ తరచూ ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నది.