పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి అంతంతే. అంతర్జాతీయ సంస్థలు, దేశాలు ఎప్పుడెప్పుడు అప్పులిస్తాయా? అని చకోర పక్షిలా ఎదురుచూస్తోంది పాక్. ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ ఆర్థికవేత్తలతో కీలక సమావేశం నిర్వహించారు. పేరుమోసిన వ్యాపారవేత్తలందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఏం చేయాలో కాస్త తమకు హితబోధ చేయాలని పాక్ ప్రధాని వ్యాపారవేత్తలను కోరారు.
అసలు ముందుగా దేశంలో తమ ఇబ్బందులేంటో నిర్మొహమాటంగా చెప్పాలని ప్రధాని కోరారు. చాలా ఓపికగా వింటామని, ఆ తర్వాత ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, దాని నుంచి గట్టెక్కే విధానాలను చెప్పాలని, వాటిని సావధానంగా, శ్రద్ధగా వింటానని ఆయన వ్యాపారవేత్తలతో అన్నారు.
తానిక్కడ రాజకీయాలు మాట్లాడడానికి గానీ, రాజకీయాలు చేయడానికి గానీ రాలేదని, కేవలం ఆర్థిక ఇబ్బందుల నుంచి ఎలా గట్టెక్కాలో శ్రద్ధగా వినడానికి, ఆచరించడానికి వచ్చానని షెహబాజ్ షరీఫ్ చెప్పుకొచ్చారు. తాను ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో ఒక్క అమెరికా డాలర్ విలువ 189 పాక్ రూపాయలుండేది.
ఇలా రూపాయి విలువ పడిపోవడానికి తమ సంకీర్ణ ప్రభుత్వం కారణం కాదని, ఇంతకు ముందున్న ప్రభుత్వం అంతర్జాతీయ చమురు ధర పెరిగినా, పెట్రో రేట్లు తగ్గించి, ఈ పరిస్థితి కల్పించిందని విమర్శించారు. ఇలా చేయడం అంతర్జాతీయ ద్రవ్యనిధి నిబంధనలకు విరుద్ధమని తెలిసినా, ఇమ్రాన్ ప్రభుత్వం చేసిందని షెహబాజ్ దుయ్యబట్టారు.