పాకిస్తాన్లో జరుగుతున్న పరిణామాలపై ఆ దేశ విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఇమ్రాన్ వ్యవహార శైలిపై గుర్రుగా వున్నాయి. తాము సుప్రీంను ఆశ్రయిస్తామని ప్రతిపక్షాలు తేల్చి చెప్పాయి. అయితే.. ప్రస్తుతం ఈ వ్యవహారం సుప్రీంకు చేరింది. ఈ వ్యవహారంపై ఓ స్పెషల్ బెంచ్ కూడా ఏర్పాటైంది. ఇక… చీఫ్ జస్టిస్ అందరి న్యాయమూర్తులతో ఓ కీలక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి, ప్రస్తుత వ్యవహారాలపై చర్చిస్తున్నారు. ఇక.. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీని ప్రతిపక్షాలు స్వాధీనం చేసుకున్నాయి. అలాగే తమ తరపున ఓ స్పీకర్ను కూడా ఎన్నకున్నాయి. సభను నడిపేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాయని పాక్ మీడియా పేర్కొంటోంది. ప్రతిపక్ష నేత అయాద్ సాదిక్ స్పీకర్ స్థానంలో కూర్చొని, సభను కూడా నడిపిస్తున్నారు.
అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగకుండా, ఇమ్రాన్ సర్కార్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ బిలావల్ భుట్టో మండిపడ్డారు. దేశంలోని రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి తాము అన్ని ప్రయత్నాలు చేస్తామని, అన్ని రకాల వ్యవస్థలనూ తాము కలుస్తామని బిలావల్ పేర్కొన్నారు. ఇక తాము పార్లమెంట్లోనే వుంటామని, ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపై ఉన్నాయని బిలావల్ అన్నారు.