Pak Economic Crisis | దయాది దేశం పాకిస్థాన్లో ఆర్థిక సంక్షోభం రోజు రోజుకు తీవ్రమవుతున్నది. ఈ ప్రభావం సైన్యంపై సైతం పడుతున్నది. ఈ మార్చి 23న నిర్వహించే పాకిస్థాన్ డే పరేడ్ను పరిమితం చేయాలని పాక్ సైన్యం నిర్ణయించింది. విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు.. నిలిచిపోయిన రుణ ప్యాకేజీపై ఐఎంఫ్తో చర్చించేందుకు పాక్ ప్రయత్నాలు చేస్తున్నది. ప్రస్తుతం ఉన్న సంక్షోభాన్ని అధిగమించేందుకు ఖర్చులను తగ్గించుకోవాలని ప్రభుత్వం మంత్రులతో పాటు అధికారులకు జారీ చేసింది. 1940 నాటి లాహోర్ తీర్మానం ఆమోదానికి జ్ఞాపకార్థంగా పాకిస్తాన్ దినోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ఇందులో పాకిస్తాన్ సైన్యం ఆయుధాలు, సైనిక నైపుణ్యాలను ప్రదర్శిస్తుంది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించిన పొదుపు డ్రైవ్లో భాగంగా సైన్యం జాతీయ దినోత్సవ కవాతును పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకుంది.
డబ్బు ఆదా చేసేందుకు పరిమిత స్థాయిలో సంప్రదాయ సాయుధ బలగాల కవాతును నిర్వహించాలని పాక్ ఆర్మీ నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వేడుకలు నిర్వహించడం కష్టంగా మారుతున్నది. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ఐఎంఎఫ్ను ఆశ్రయించగా.. ప్యాకేజీ నిలిచిపోయింది. తాజాగా మరోసారి ఐఎంఎఫ్తో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. రాబోయే రెండు రోజుల్లో చర్చలు జరుపనున్నట్లు ఆర్థికమంత్రి ఇషాక్దార్ తెలిపారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి రుణం ఇచ్చేందుకు పాక్ ప్రభుత్వం ముందు షరతులు విధించిన విషయం తెలిసిందే. ఈ షరతులపై అంగీకారం తెలుపడంలో విఫలమైంది. పాక్ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. మరో వైపు ఐఎంఎఫ్తో స్టాఫ్ లెవల్ అగ్రిమెంట్పై సంతకం చేసేందుకు.. ప్రపంచ బ్యాంక్ నుంచి 2 బిలియన్ డిపాజిట్తో పాటు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుంచి 950 మిలియన్ల రుణాన్ని పొందేందుకు పాక్ సౌదీ అరేబియా సహాయం కోరింది.
అదనపు వ్యయాలను తగ్గించుకునేందుకు ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ఇటీవల విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఆదేశించారు. మరోవైపు, ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ ప్రభుత్వం పొదుపు ప్రచారాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. క్యాబినెట్ సభ్యులందరూ పెద్ద జీపులను ఉపయోగించడం మానేశారు. షరీఫ్ ప్రభుత్వం 15 శాతం ఖర్చును తగ్గించుకుంటుంది. అధికారిక ప్రతినిధి బృందం ఫైవ్ స్టార్ హోటళ్లలో బస చేయదని, ప్రభుత్వ అధికారులు, మంత్రులు ఎకానమీ క్లాస్లో ప్రయాణించాలని ఆదేశించారు. మరోవైపు, రాజకీయ నాయకులు, న్యాయమూర్తులు, జనరల్లతో సహా ప్రతి ఒక్కరి నుంచి టోల్ టాక్స్ వసూలు చేయాలని పాకిస్తాన్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఆదేశించింది. సాయుధ బలగాలు, పోలీసుల విధుల్లో ఉన్న సిబ్బందికి మాత్రమే మినహాయింపును ఇచ్చింది.