Firing : హమాస్ మిలిటెంట్లను ఏరివేసేందుకు ఇజ్రాయెల్ చేపట్టిన యుద్ధం కారణంగా గాజా మరుభూమిగా మారింది. ఎక్కడ చూసినా మృతదేహాలు, భవన శిథిలాలే కనిపిస్తున్నాయి. అక్కడక్కడా గాజా పౌరులు దయనీయ పరిస్థితిల్లో జీవిస్తున్నారు. తిండి నీరు లేక ఆకలితో అలమటిస్తున్నారు. ఇటు ఇజ్రాయెల్ సైన్యం కాల్పులు, అటు హమాస్ ఉగ్రవాదుల ఎదురుకాల్పుల మధ్య వారు నలిగిపోతున్నారు. ఈ నేపథ్యంలో గాజా పౌరుల ఆకలి తీర్చేందుకు ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు గాజాలో మానవతా సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశాయి. ఈ కేంద్రాల వద్ద ఇజ్రాయెల్ సైన్యం కాపలా కాస్తోంది.
ఆకలికి తట్టుకోలేక జనం ఆ కేంద్రాల వద్దకు పోటెత్తుతున్నారు. వారిని నియంత్రించేందుకు సైనికులు కాల్పులు జరుపుతున్నారు. తాజాగా నార్త్ గాజాలోని ఓ ఆహార పంపిణీ కేంద్రం వద్ద గుమిగూడిన జనాలను నియంత్రించేందుకు ఇజ్రాయెల్ సైన్యం కాల్పులు జరిపిందని, ఈ ఘటనలో ఏకంగా 90 మంది మరణించారని గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ ఆరోపించింది. ఆకలికి తట్టుకోలేక సాయం కోసం వచ్చిన అమాయకులపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ తూటాల వర్షం కురిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది.