కీవ్: అత్యంత కీలకమైన ‘నోవా కఖోవ్కా’ డ్యామ్(Kakhovka dam)ను రష్యా పేల్చివేసింది. దీంతో ఉక్రెయిన్లోని దిగువ ప్రాంతాల్ని వరద ముంచెత్తుతోంది. దాదాపు 42 వేల మంది వరద ముంపులో ఉన్నట్లు తేలింది. వరద ప్రభావిత ప్రాంతాల్లోని వారిని అధికారులు ఖాళీ చేయించారు. రష్యా బలగాలు ఉక్రెయిన్లోకి వెళ్లాలంటే నీపర్ నదిపై ఉన్న ఈ డ్యాం కీలకం.
అందువల్లే ఆనకట్టను కూల్చేశారని వార్తలు వెలువడ్డాయి. ఆనకట్ట కూల్చివేతను రష్యా అధికారులు ఉగ్రవాద చర్యగా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, క్రీమియా ఆక్రమణపై ద హేగ్లోని అంతర్జాతీయ న్యాయస్థానం మంగళవారం విచారణ చేపట్టింది.
డ్యామ్ పేల్చివేత వల్ల పరిణామాలు తీవ్రంగా ఉంటాయని యూఎన్ చీఫ్ హెచ్చరించారు. డ్యామ్ కూలిపోవడానికి నువ్వంటే నువ్వే కారణమని ఉక్రెయిన్, రష్యాలు ఆరోపించుకుంటున్నాయి. డ్యామ్ తెగడంతో ఒక్కసారిగా వార్ జోన్లోకి నీళ్లు వచ్చేశాయి. సోవియేట్ కాలం నాటి నోవా కఖోవ్కా డ్యామ్ను హైడ్రో ఎలక్ట్రిక్ స్టేషన్గా వాడుతున్నారు.
రష్యా ఆక్రమణదారులు కావాలనే హైడ్రోఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ను పేల్చివేశారని, ఇది మానవహనన పర్యావరణ బాంబుగా ఆయన అభివర్ణించారు. నిన్న రాత్రి ఇచ్చిన వీడియో సందేశంలో జెలెన్స్కీ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. డ్యామ్ను కూల్చినంత మాత్రాన తమను ఎవరూ ఆపలేరని ఆయన అన్నారు.
కఖోవ్కా రిజర్వాయర్లోని నీరును రైతులకు, నివాసితులకు సరఫరా చేస్తారు. జపోరిజియా న్యూక్లియర్ ప్లాంట్కు కూడా ఇక్కడ నుంచే నీరు వెళ్తుంది. రష్యా ఆధీనంలోని క్రిమియా ప్రాంతానికి కూడా ఈ డ్యామ్ నుంచే నీళ్లు వెళ్తాయి.
డ్యామ్కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖేర్సన్ సిటీ నీటితో నిండిపోయింది. అక్కడ నీటి స్థాయి 3.5 మీటర్లకు పెరిగింది. మోకాళ్ల లోతుకు నీరు చేరడంతో స్థానికులు గ్రామాల్ని వీడుతున్నారు. బస్సులు, రైళ్లు, ప్రైవేటు వాహనాల ద్వారా ప్రజల్ని తరలిస్తున్నారు.