న్యూయార్క్: సంక్షోభం, హింస, ఇతర విపత్తుల వల్ల గత ఏడాది(2021) చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 3.65 కోట్ల మంది చిన్నారులు చెల్లాచెదురైనట్లు యునైటెడ్ నేషన్స్ చిల్డ్రెన్స్ ఫండ్ ఒక రిపోర్ట్లో తెలిపింది. సంక్షోభాల వల్ల అస్తవ్యస్తమైన చిన్నారుల సంఖ్య 2021లో 22 లక్షలకు పెరిగినట్లు తెలుస్తోంది. దీంట్లో 13 లక్షల మంది శరణార్థులు కాగా, సంక్షోభం-హింస వల్ల చెదిరిన వారిసంఖ్య 2.28 కోట్లుగా ఉందని యునిసెఫ్ తన ప్రకటనలో తెలిపింది. అయితే పర్యావరణ విపత్తులు, ఉక్రెయిన్-రష్యా యుద్ధం వల్ల చెదిరిపోయిన పిల్లల సంఖ్యను ఈ రిపోర్ట్లో చేర్చడం లేదని యునిసెఫ్ తెలిపింది. అయోమయంలో ఉన్న పిల్లల్ని గమనిస్తే పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్లు తెలుస్తోందని యునిసెప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ క్యాథరీన్ రస్సెల్ తెలిపారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అత్యధిక స్థాయిలో 2021లో చిన్నారులు ఛిన్నాభిన్నం అయినట్లు ఆమె వెల్లడించారు.