న్యూఢిల్లీ: దేశంలో వ్యాక్సిన్నేషన్ (Vaccination) ప్రక్రియలో మరో ముందడుగు పడింది. 12-14 ఏండ్ల చిన్నారులకు బుధవారం నుంచి టీకాలు పంపిణీ చేస్తున్నారు. దీంతో తొలిరోజు దేశవ్యాప్తంగా 2.6 లక్షల మందికి పైగా చిన్నారులు తమ మొదటి డోసును తీసుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 28 రోజుల వ్యవధిలో రెండో డోసు ఇవ్వనున్నారు. హైదరాబాదీ సంస్థ బయోలాజికల్ ఈ సంస్థ తయారుచేసిన కార్బెవాక్స్ టీకాను చిన్నారులకు ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం దేశంలో 2021, మార్చి 1 నాటికి 12 నుంచి 13 ఏండ్ల వయస్సు ఉన్న చిన్నారులు 4.7 కోట్ల మంది ఉన్నారు.
కాగా, చిన్నారులతోపాటు 60 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికి ప్రికాషనరీ డోసును పంపిణీ చేస్తున్నారు. ఇందులో భాగంగా నిన్న ఒక్కరోజే 2 కోట్ల 15 లక్షల 44 వేల 283 మంది హెల్త్ వర్కర్లు, ఫ్రంట్లైన్ వారియర్స్, 60 ఏండ్లు పైబడినవారు వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,80,69,92,584 కరోనా వ్యాక్సిన్ డోసులు పంపణీ చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ 2021, జనవరి 16న ప్రారంభమైన విషయం తెలిసిందే. మొదటి దశలో ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్ ఇచ్చారు. ఇక ఫ్రంట్లైన్ వర్కర్లకు అదేఏడాది ఫిబ్రవరి 2 నుంచి, 60 ఏండ్లు పైబడిన, 45 ఏండ్లు దాటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి మార్చి 1 నుంచి, 45 ఏండ్లు నిండిన అందరికి ఏప్రిల్ 1 నుంచి, 18 ఏండ్లు నిండిన అందరికి మే 1 నుంచి, 15-18 ఏండ్ల మధ్య వయస్కులకు ఈ ఏడాది జనవరి 3 నుంచి వ్యాక్సినేషన్ చేస్తున్నారు.