బాలీ: ఇండోనేషియాలోని బాలీలో జరుగుతున్న జీ20 దేశాల సదస్సులో ఇవాళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ కలుసుకున్నారు. ఇద్దరు కరచాలనం చేసుకున్నారు. తైవాన్ అంశంలో రెండు దేశాల మధ్య గత కొన్నాళ్ల నుంచి ఘర్షణాత్మక వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. వేర్వేరు టేబుళ్లపై కూర్చున్న ఇద్దరూ ద్వైపాక్షిక భేటీలో మాట్లాడారు.
అయిదేళ్ల క్రితం దావోస్ సభలో మిమ్మల్ని కలిశానని, మీరు దేశాధ్యక్షుడు అయ్యాక, ఆన్లైన్ కాల్స్ ద్వారా టచ్లో ఉన్నామని, కానీ ముఖాముఖీగా ఎదురుపడడం కీలకమని, అందుకే ఇవాళ భేటీ అవుతున్నామని చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ అన్నారు. ఎంతో అనుభవం నేర్చుకున్నామని, ఎన్నో పాఠాలు కూడా నేర్చుకున్నామన్నారు. చరిత్రే మనకు మంచి పుస్తకం అని, ఆ చరిత్రను మనం అద్దంలా చూడాలన్నారు. అమెరికా, చైనా మధ్య ఉన్న రిలేషన్పిప్ కీలకమైందని, రెండు పెద్ద దేశాలకు చెందిన నేతలుగా సరైన నిర్ణయాన్ని తీసుకోవాలని జిన్పింగ్ తెలిపారు.
ద్వైపాక్షిక బంధాల్ని బలోపేతం చేసేందుకు సరైన మార్గాన్ని ఎన్నుకోవాలన్నారు. మన భేటీ ప్రపంచ దేశాలను ఆకర్షించిందని, ప్రపంచ శాంతి కోసం అన్ని దేశాలతో మనం కలిసి పనిచేయాలని జిన్పింగ్ అన్నారు. వ్యూహాత్మక అంశాల్లో చర్చలు ఉండాలని, మీతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు జిన్పింగ్ తెలిపారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా మాట్లాడారు. అమెరికా, చైనా మధ్య ఘర్షణను నివారించడమే తన ముఖ్య ఉద్దేశమని అన్నారు. రెండు దేశాలు స్నేహపూర్వకంగా పనిచేయాలని ప్రపంచ దేశాలు ఆశిస్తున్నట్లు బైడెన్ తెలిపారు.