European Airports : యూరోపియన్ దేశాల్లోని ఎయిర్పోర్టులు సైబర్దాడి (Cyber attack) కి గురయ్యాయి. లండన్ (Landon) లోని హీత్రో ఎయిర్పోర్టు, బెల్జియంలోని బ్రసెల్స్ ఎయిర్పోర్టు, జర్మనీలోని బెర్లిన్ ఎయిర్పోర్టు సహా పలు యూరోపియన్ దేశాల్లోని విమానాశ్రయాల (European countries airports) పై సైబర్దాడి జరిగింది. దాంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
సైబర్ నేరగాళ్లు సర్వీస్ ప్రొవైడర్లను లక్ష్యంగా చేసుకోవడంతో చెక్-ఇన్, బోర్డింగ్ వ్యవస్థలు వంటి సేవలు నిలిచిపోయినట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. విమానాశ్రయ సేవల్లో అంతరాయం నెలకొనడంతో అనేక విమానాలు ఆలస్యం కాగా.. పలు విమానాలు రద్దయినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. దాంతో వివిధ దేశాలకు వెళ్లాల్సిన వేలమంది ప్రయాణికులపై ప్రభావం పడింది. విమాన సర్వీసుల పునరుద్ధరణ గురించి తెలుసుకోవడానికి సంబంధిత వెబ్సైట్లను పరిశీలించాలని అధికారులు ప్రయాణికులకు సూచించారు.
సైబర్ దాడి కారణంగా బ్రసెల్స్ విమానాశ్రయంలోని ఆటోమేటెడ్ చెక్-ఇన్, బోర్డింగ్ సేవలు పనిచేయడం లేదని అక్కడి అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం సిస్టమ్ను సరిచేసేందుకు తమ సాంకేతిక బృందం శ్రమిస్తోందని, త్వరలో సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. ఇప్పటికే విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికుల సౌకర్యార్థం పలు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
యూరప్లోని దాదాపు అన్ని ముఖ్య విమానాశ్రయాలు సైబర్ దాడికి గురైనట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. సిస్టమ్ ప్రొవైడర్లో తలెత్తిన సాంకేతిక సమస్యవల్ల విమానాలు ఆలస్యమవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.