సిడ్నీ: ఆస్ట్రేలియా పోలీసులు రహస్యంగా నిర్వహించిన ఓ ఆపరేషన్ ద్వార వందల సంఖ్యలో డ్రగ్ నేరస్థులు పట్టుబడ్డారు. ఆపరేషన్ ఐరన్సైడ్ పేరుతో ఆ ఆపరేషన్ సాగినట్లు ఆ దేశ ప్రధాని స్కాట్ మారిసన్ తెలిపారు. ఏఓఎన్ఎమ్ యాప్ ద్వారా రహస్యంగా డ్రగ్స్ దందా నిర్వహిస్తున్న వారిపై దేశవ్యాప్తంగా దాడులు చేశారు. ఆ యాప్ను వాడుతున్న వారిని గత మూడేళ్ల నుంచి ప్రపంచ వ్యాప్తంగా పట్టుకున్నట్లు ఇవాళ పోలీసులు వెల్లడించారు. 2018లో ఆస్ట్రేలియా పోలీసులు, ఎఫ్బీఐ అధికారులు An0m అనే ఎన్క్రిఫ్ట్ యాప్ను తయారు చేశారు. దాని ద్వారా వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న వారిపై నిఘా పెట్టారు. ఆసియా, ఉత్తర అమెరికా, దక్షిణమెరికా, యూరోప్, మిడిల్ ఈస్ట్లోని 18 దేశాల్లో మాదక ద్రవ్యాల వ్యాపారానికి పాల్పడుతున్న 800 మందిని అరెస్టు చేశారు. ఈ స్టింగ్ ఆపరేషన్తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రిమినల్ గ్యాంగ్స్కు భారీ షాక్ తగిలిందని ప్రధాని స్కాట్ తెలిపారు.
ఆపరేషన్ ఐరన్సైడ్ గురించి ఆస్ట్రేలియా తొలిసారి బయటపెట్టింది. వాస్తవానికి ఎఫ్బీఐ అధికారులు ఈ ప్లాన్ను అమలు చేశారు. డ్రగ్ వ్యాపారుల అరెస్టు గురించి అమెరికా, యూరోప్ దేశాలు కూడా త్వరలో ప్రకటనలు చేయనున్నాయి. ఆర్గనైజ్డ్ నేరాలకు పాల్పడుతున్న వారంతా An0m యాప్ను మెసేజ్ సర్వీస్గా వాడుకునేవారు. యాప్లో భాగస్వాములైన అండర్ కవర్ పోలీసులు డ్రగ్ నేరస్థుల ప్రణాళికలను ఎప్పటికప్పుడు తెలుసుకునేవారు. డ్రగ్స్ దందా, మర్డర్ ప్లాన్లు వేస్తున్న వారిని ఆ యాప్ ద్వారా పట్టుకున్నారు. ఆస్ట్రేలియాలో ఐరన్సైడ్ ఆపరేషన్తో 220 మందిని అరెస్టు చేశారు. 3.7 టన్నుల మాదకద్రవ్యాలను, 104 ఆయుధాలను, 4.5కోట్ల డాలర్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. సుమారు నాలుగు వేల మంది పోలీసులు ఈ ఆపరేషన్లో నిమగ్నమైనట్లు స్కాట్ తెలిపారు.