కీవ్: సరైన దౌత్యంతోనే ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం ముగుస్తుందని అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య చర్చల్లో ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్ టీవీలో ప్రసంగించిన ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ.. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధంలో తాము విజయం సాధించనున్నట్లు చెప్పారు. కానీ సమస్యలన్నింటికీ పరిష్కారం కేవలం దౌత్యం ద్వారానే సాధ్యం అవుతుందని ఆయన న్నారు. ఈ సంగ్రామంలో రక్తపాతం తప్పదని, ఫైటింగ్ కొనసాగుతోందని, కానీ దౌత్యం ద్వారా కచ్చితంగా సమస్య అంతం అవుతుందని అన్నారు. కానీ రెండు దేశాలు పట్టువీడడం లేదని, అందుకే ఇది అంత సాధ్యమయ్యే విషయం కాదు అని జెలెన్స్కీ అన్నారు. ప్రస్తుతం రష్యాతో శాంతి చర్చల ప్రక్రియ కొనసాగుతుందని ఉక్రెయిన్ దౌత్యాధికారి మైఖలో పొడోయాక్ తెలిపారు. రెండు దేశాల మధ్య చివరిసారి ఏప్రిల్ 22వ తేదీన చర్చలు జరిగాయి.
ఆయుధాలు ధ్వంసం..
ఇక ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు పంపిన భారీ ఆయుధ సామాగ్రిని ధ్వంసం చేసినట్లు రష్యా తెలిపింది. కీవ్కు పశ్చిమంగా ఉన్న జిటోమిర్ ప్రాంతంలోని ఓ రైల్వే స్టేషన్ వద్ద ఆయుధాలను ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. క్షిపణులను లాంచ్ చేసి వాటిని నాశనం చేసినట్లు రక్షణ కార్యాలయం తెలిపింది. డోన్బాస్ ప్రాంతానికి పశ్చిమ దేశాలు తరలించాలనుకున్న ఆయుధాలను పేల్చివేసినట్లు రష్యా చెప్పింది. ఒడిస్సా సిటీలో ఉన్న ఉక్రెయిన్ స్పెషల్ ఆపరేషన్స్ ఫోర్సెస్ శిక్షణ కేంద్రాన్ని కూడా పేల్చివేసినట్లు రష్యా తెలిపింది.