NSA Ajit Doval : జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్నారు. మంగళవారం ఆయన చైనా ఉపాధ్యక్షుడు హన్ జెంగ్తో భేటీ అయ్యారు. ఇండియా-చైనా మధ్య నేటి నుంచి 25వ ప్రత్యేక ప్రతినిధుల భేటీ జరగనుంది. చైనా విదేశాంగ మంత్రి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా సెంట్రల్ కమిటీ సభ్యుడు వాంగ్ యి ఆహ్వానం మేరకు అజిత్ దోవల్ అక్కడ పర్యటిస్తున్నారు.
ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదంపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ఇందుకోసం అజిత్ దోవల్ సోమవారం చైనా చేరుకున్నారు. మంగళవారం నుంచి చైనాకు చెందిన వివిధ ప్రజా ప్రతినిధులతో భేటీ కానున్నారు. దీనిలో భాగంగా చైనా ఉపాధ్యక్షుడు హన్ జెంగ్తో భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య శాంతి నెలకొల్పే అంశాలతోపాటు, సరిహద్దు వివాదంపై కూడా చర్చలు జరిపారు. సరిహద్దులో వివాదాలు, ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా చూడటమే లక్ష్యంగా ఈ భేటీ జరిగింది.
అలాగే, ఆర్థిక, రాజకీయ అంశాలతోపాటు ఇతర ద్వైపాక్షిక అంశాలపై కూడా చర్చించారు. అనంతరం వాంగ్ యితో కూడా చర్చిస్తారు. రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదంపై 2003 నుంచి ప్రత్యేక ప్రతినిధుల సమావేశాలు జరుగుతున్నాయి. ఇండియా-చైనా మధ్య 3,488 కిలోమీటర్ల మేర సరిహద్దు సమస్య నెలకొంది. దీంతో ఉద్రిక్త, ఘర్షణ వాతావరణం నెలకొంది. పలుసార్లు రెండు దేశాల మధ్య సరిహద్దులో జరిగిన ఘర్షణల్లో సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అందుకే, సరిహద్దులో శాంతి నెలకొనాలని ఇండియా, చైనా భావిస్తున్నాయి.
మరోవైపు వచ్చే నెలలో ఇండియాలో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ హాజరుకానున్నారు. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఈ సదస్సు జరగనుంది. ఈ సందర్భంగా జిన్పింగ్.. భారత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యే అవకాశాలున్నాయి.