ప్యోంగ్యాంగ్: ఉత్తర కొరియా(North Korea) ఇవాళ ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించింది. జపాన్ సముద్ర జలాల దిశగా ఆ మిస్సైల్ను టెస్ట్ చేసింది. ఆ క్షిపణి ప్రొజెక్టైల్ సముద్ర జలాల్లో పడినట్లు జపాన్ రక్షణ మంత్రి తెలిపారు. ఉత్తర కొరియా పశ్చిమ తీరం నుంచి దాన్ని పరీక్షించినట్లు తెలుస్తోంది. విమానాలకు కానీ నౌకలకు కానీ ఎటువంటి నష్టం జరగలేదని ప్రభుత్వం వర్గాలు చెబుతున్నాయి.
ఈ ఏడాది బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించడం ఇది మూడవసారి. ఆ క్షిపణికి హైపర్సోనిక్ వార్హెడ్ను అమర్చినట్లు దక్షిణ కొరియా మిలిటరీ అధికారులు వెల్లడించారు. సుమారు 600 కిలోమీటర్ల దూరం ఆ క్షిపణి ప్రయాణించి ఉంటుందని అంచనా వేశారు.
జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా ఈ ప్రయోగాన్ని ఖండించారు. ఉత్తర కొరియా ఈ ఏడాది చాలా సార్లు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని, దీంతో ప్రాంతీయ భద్రతకు ముప్పు ఉందని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించబోమని ఆయన అన్నారు.