స్టాక్హోమ్: ఫిజిక్స్లో ఇవాళ నోబెల్ బహుమతి విజేతలను ప్రకటించారు. ఈ యేటి నోబెల్ ఫిజిక్స్ ఇద్దరికి దక్కింది. రాయల్ స్విడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఆ పేర్లను ఇవాళ ప్రకటించింది. జాన్ జే హోప్ఫీల్డ్, జెఫరీ ఈ హింటన్ ఆ పురస్కారాలు గెలుచుకున్నారు. ఆ శాస్త్రవేత్తలు కృత్రిమ న్యూరో నెట్వర్క్ ద్వారా మెషీన్ లెర్నింగ్కు సంబంధించిన వ్యవస్థీకృత ఆవిష్కరణలు చేసినట్లు ఫిజిక్స్ కమిటీ తన ప్రకటనలో వెల్లడించింది.
BREAKING NEWS
The Royal Swedish Academy of Sciences has decided to award the 2024 #NobelPrize in Physics to John J. Hopfield and Geoffrey E. Hinton “for foundational discoveries and inventions that enable machine learning with artificial neural networks.” pic.twitter.com/94LT8opG79— The Nobel Prize (@NobelPrize) October 8, 2024
భౌతిక శాస్త్రంలోని ప్రామాణికమైన నిర్మాణాత్మక విధానాల ద్వారా శక్తివంతమైన మెషీన్ లెర్నింగ్ టెక్నిక్లు సృష్టించినట్లు నోబెల్ కమిటీ తెలిపింది. సమాచారాన్ని స్టోర్ చేసి, రీ కన్స్ట్రక్ట్ చేసే విధానాన్ని జాన్ హోప్ఫీల్డ్ సృష్టించినట్లు కమిటీ వెల్లడించింది. డేటాలో ఉన్న వివిధ ప్రాపర్టీల గురించి జెఫ్రీ హింటన్ ఓ విధానాన్ని డెవలప్ చేశారు. ఆ విధానం ద్వారా ప్రస్తుతం వినియోగంలో ఉన్న కృత్రిమ న్యూరల్ నెట్వర్క్ను అమలు చేయవచ్చు అని కమిటీ తెలిపింది.
గత ఏడాది ఫిజిక్స్లో ముగ్గురికి నోబెల్ పురస్కారం దక్కింది. 2023లో శాస్త్రవేత్తలు అన్నే ఎల్ హుయిలైర్, పీరీ అగోస్టిని, క్రాజ్లు ఆ అవార్డు అందుకున్నారు. ఎలక్ట్రాన్ల వేగంపై అధ్యయనం చేసినందుకు వాళ్లకు ఆ బహుమతి దక్కింది. కణంలోని చిన్న ఎలక్ట్రాన్లు ఎలా కేంద్రకం చుట్టు భ్రమిస్తాయన్న విషయాన్ని వాళ్లు తేల్చారు. ఇక సోమవారం నోబెల్ కమిటీ.. మెడిసిన్లో ఈ యేటి విజేతలను ప్రకటించింది. మైక్రో ఆర్ఎన్ఏను ఆవిష్కరించిన అమెరికా శాస్త్రవేత్తలు విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్కున్లకు ఆ పురస్కారం దక్కిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 224 మందికి ఫిజిక్స్లో నోబెల్ ఇచ్చారు.