షాంఘై: చైనాలో జరిగిన ఎలక్ట్రిక్ కారు ప్రమాదం ఆ దేశంలో తీవ్ర దుమారం రేపుతోంది. నియో కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ కారు షాంఘైలో ఉన్న ఓ బిల్డింగ్లోని మూడవ అంతస్తు నుంచి కింద పడింది. ఈ ఘటనలో ఇద్దరు టెస్ట్ డ్రైవర్లు ప్రాణాలు కోల్పోయారు. బుధవారం జరిగిన ఈ ఘటన పట్ల చైనా సోషల్ మీడియాలో తీవ్ర ప్రచారం సాగుతోంది. మూడవ అంతస్తు నుంచి కింద పడ్డ కారు ప్రమాద ఘటనపై విచారణ చేపట్టినట్లు ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. బిల్డింగ్లో మూడవ అంతస్తు నుంచి కారు కింద పడిదంటే, అది షోరూమ్ లేదా టెస్టింగ్ సెంటర్ లేదా కారు పార్కింగ్ ఏరియా అయి ఉంటుందని భావిస్తున్నారు. వీబోలో నియో కంపెనీ చేసిన మెసేజ్పై క్షణాల్లో వేలాది మంది కామెంట్లు గుప్పించారు. ఇది వాహనానికి సంబంధించిన ప్రమాదం కాదు అని ఆ కంపెనీ తన ప్రకటనలో చెప్పడం పట్ల నెటిజన్లు సీరియస్ అయ్యారు. ఈ ప్రమాదంపై బహిరంగ విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నారు.