నెపితా: మయన్మార్ నేత ఆంగ్ సాన్ సూకీపై కొత్త నేరాభియోగం నమోదు అయ్యింది. జుంటా సైన్యం ఆమెపై కొత్త కేసును బుక్ చేసినట్లు ఆమె తరపు న్యాయవాది తెలిపారు. 75 ఏళ్ల సూకీని గృహనిర్బంధం చేసిన విషయం తెలిసిందే. మయన్మార్ ప్రభుత్వాన్ని అక్కడి ఆర్మీ ఫిబ్రవరి ఒకటో తేదీన హస్తగతం చేసుకున్నది. ఆ తర్వాత అక్కడ భారీ స్థాయిలో అల్లర్లు జరుగుతున్నాయి. సైన్యాన్ని వ్యతిరేకిస్తూ జరుగుతున్న ఆందోళనల్లో ఇప్పటికే 700 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. సూకీపై జీవిత కాలం వేటు వేసే విధంగా అక్కడ ఆర్మీ పటిష్టమైన కేసులను ఆమెపై ఇరికిస్తున్నారు. తాజాగా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టంలోని సెక్షన్ 25 కింద ఆమెపై కేసు నమోదు చేశారు. నెపితాలో ఉన్న కోర్టుకు సూకీ వీడియో లింక్ ద్వారా హాజరైంది. సూకీపై కొత్త కేసు నమోదు అయినట్లు ఆమె లాయర్ మిన్ మిన్ సో తెలిపారు. ఇప్పటికే ఆమెపై అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ కింద కేసు నమోదు అయ్యింది.