హేగ్: నెదర్లాండ్స్కు చెందిన జొనాథన్ జాకబ్ మేజర్ అనే వ్యక్తి తన వీర్య దానం(Sperm Donor)తో సుమారు 550 మంది పిల్లలకు తండ్రి అయ్యాడు. అయితే ఆ దేశ కోర్టు ఈ కేసులో కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి ఆ వ్యక్తి తన వీర్యాన్ని దానం చేయకుండా బ్యాన్ విధించింది. 41 ఏళ్ల జాకబ్కు సుమారు లక్ష యూరోల ఫైన్ కూడా వేసింది. భారీ సంఖ్యలో పిల్లలకు తండ్రి అయిన జొనాథన్పై ఓ మహిళ హేగ్ కోర్టులో కేసు దాఖలు చేసింది.
వీర్య దానం వల్ల పిల్లలు కన్న తల్లితండ్రులు ఇప్పుడు గుబులు పడుతున్నారని, ఆ వ్యక్తికి పుట్టిన పిల్లలు భారీ సంఖ్యలో ఉన్నట్లు పేరెంట్స్ ఆరోపిస్తున్నట్లు కోర్టు చెప్పింది. అయితే ఇక నుంచి కొత్త పేరెంట్స్కు వీర్యాన్ని డొనేట్ చేయకుండా జొనాథన్ను నిషేధించాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది. ఈ నేపథ్యంలో జడ్జి హెస్సీలింక్ ఆదేశాలు జారీ చేశారు.
సుమారు 13 క్లినిక్లకు జాకబ్ తన స్పెర్మ్లను దానం చేశారు. దాంట్లో 11 క్లినిక్లు నెదర్లాండ్స్లోనే ఉన్నాయి. డచ్ ఆరోగ్య మార్గదర్శకాల ప్రకారం.. వీర్యదాతలు 12 మంది మహిళల కన్నా ఎక్కువ సంఖ్యలో మహిళలకు తమ వీర్యాన్ని దానం చేయరాదు లేదా 25 మంది పిల్లల కన్నా ఎక్కువ సంఖ్యలో పిల్లలకు తండ్రి కారాదు అని రూల్ ఉంది. వందల సంఖ్యలో సోదరులు ఉన్నట్లు తెలుసుకుని పిల్లలు మానసిక సమస్యలకు లోనయ్యే అవకాశాలు ఉన్నాయని, అందుకే ఆ వీర్యదాతపై బ్యాన్ విధించినట్లు కోర్టు తెలిపింది. 2007 నుంచి 2017 వరకు జాకబ్ తన వీర్యాన్ని దానం చేశాడు.