కాఠ్మాండూ: నేపాల్ను ముంచెత్తిన ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. దేశవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో సహాయక బృందాలు మరిన్ని మృతదేహాలను వెలికితీయడంతో మృతుల సంఖ్య మంగళవారం నాటికి 1,003కు పెరిగినట్లు అధికారులు ప్రకటించారు. మరో 4,000 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదని, సహాయక చర్యల్లో భాగంగా ఇప్పటి వరకూ 12,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు నేపాల్ జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు, నిర్వహణ అథారిటీ(ఎన్డీఆర్ఆర్ఎంఏ) వెల్లడించింది. ఆగస్టు 26న నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో భారీ హిమపాతం సంభవించి, పెద్ద ఎత్తున మంచు, రాళ్లు విరిగిపడటంతో ఒక్కసారిగా ఆకస్మిక వరదలు పోటెత్తాయి. హిమాలయ సరిహద్దు ప్రాంతం నుంచి దక్షిణంవైపు ప్రవహించే బోటెకోషి నది తీవ్ర ఉధృతితో ఉప్పొంగి ప్రవహించింది.
ఈ వరద ప్రవాహం ఉత్తర, మధ్య నేపాల్లోని పట్టణాలు, గ్రామాలను పూర్తిగా ముంచెత్తింది. వరద తీవ్రతకు వందలాది నివాసాలు, వంతెనలు, రహదారులు, వాహనాలు కొట్టుకుపోగా, పలు కీలక జల విద్యుత్తు ప్రాజెక్టులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరద నీరు ఒక్కసారిగా ముంచెత్తడంతో పలు జల విద్యుత్తు ప్రాజెక్టుల సొరంగాల్లో వందలాది మంది కార్మికులు చిక్కుకుపోయారు. కొందరు కార్మికులు ప్రాణభయంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బయటపడగా, మిగిలినవారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
వరద నీటిలో దొరికే చేపలు తినొద్దు.. బీహార్ ప్రభుత్వం హెచ్చరిక
నేపాల్ వరద నీటితో పాటు బీహార్లోకి కొట్టుకొచ్చిన చేపలను తినడం ప్రమాదకరమని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేవరకు ప్రజలు వాటిని పట్టడం, విక్రయించడం లేదా తినడం చేయవద్దని కోరింది. నేపాల్లో ఆకస్మిక వరదల తర్వాత త్రిశూలి నది నీరు ఉత్తర బీహార్లోని ప్రధాన నదులైన గండక్, కోసి నదుల ద్వారా రాష్ట్రంలోకి ప్రవహిస్తోంది. నదుల్లో నీటి మట్టాలు పెరగడంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో వివిధ రకాల చేపలు కనిపిస్తున్నాయి. వాటిని తిన్న కొందరు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. వరద నీటిలోని కాలుష్యం, బ్యాక్టీరియా, వైరస్లు, ఇతర వ్యాధికారక క్రిములు ఈ చేపలకు సోకే ప్రమాదం ఉందని ప్రభుత్వం పేర్కొంది. అందుకే వీటికి దూరంగా ఉండాలని సూచించింది.