ఖాట్మండు: నేపాల్ నూతన ప్రధాని, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్-మావోయిస్టు సెంటర్ (CPN-Maoist center ) చైర్మన్ పుష్పకమల్ దహల్ అలియాస్ ప్రచండ తన క్యాబినెట్ను విస్తరించారు. మంత్రివర్గంలోకి కొత్తగా మరో 15 మందిని తీసుకున్నారు. వారిలో 12 మంది మంత్రులుగా, ముగ్గురు సహాయ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
ప్రచండ ప్రధానిగా ఎన్నికైన తర్వాత దాదాపు నెల రోజులకే క్యాబినెట్ను విస్తరించారు. గత డిసెంబర్ 25న ప్రచండ ప్రధాని ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత రోజే ముగ్గురిచేత ఉప ప్రధానులుగా, నలుగురి చేత మంత్రులుగా ప్రమాణం చేయించారు. సోమవారం సాయంత్రం సంకీర్ణ కూటమిలోని పార్టీల అధ్యక్షులంతా సమావేశమై ఎవరికి ఎన్ని పదవులు అనే విషయంలో ఒక ఒప్పందానికి వచ్చారు.
ఆ ఒప్పందం ప్రకారం ఆయా పార్టీల నేతలకు మంత్రి పదవులు ఇచ్చారు. సంకీర్ణంలోని అతిపెద్ద పార్టీ అయిన CPN-UMLకు రెండు సహాయ మంత్రి పదవులు సహా మొత్తం ఎనిమిది మంత్రి పదవులు దక్కాయి. ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్న సీపీఎన్ (మావోయిస్టు సెంటర్)కు ప్రధాని పదవి సహా, ఐదు మంత్రి పదవులు వచ్చాయి. ఇక రాష్ట్రీయ స్వతంత్రపార్టీ, రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీలకు మూడేసి చొప్పున మంత్రి పదవులు దక్కాయి.