వాషింగ్టన్: ఉక్రెయిన్ సరిహద్దులో తన సైనిక బలగాలను రష్యా మరింతగా మోహరిస్తున్నది. దీంతో ఆ దేశంపై రష్యా దాడి చేయవచ్చన్న ఊహాగానాలు మరింతగా ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్కు మద్దతుగా తమ సైనిక దళాలను సిద్ధంగా ఉంచినట్లు నాటో తెలిపింది. తూర్పు ఐరోపాకు మరిన్ని యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలను తరలిస్తున్నట్లు సోమవారం వెల్లడించింది.
“నాటోకు అదనపు బలగాలను అందిస్తున్న మిత్రదేశాలను నేను స్వాగతిస్తున్నాను” అని పశ్చిమ సైనిక కూటమి సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్బర్గ్ ఒక ప్రకటనలో తెలిపారు. నాటో కూటమి తూర్పు భాగాన్ని బలోపేతం చేయడంతో సహా అన్ని మిత్రదేశాలను రక్షించడానికి అవసరమైన అన్ని చర్యలను కొనసాగిస్తుందని చెప్పారు.
మరోవైపు రష్యా దాడి ముప్పు నేపథ్యంలో ఉక్రెయిన్లోని తమ రాయబార కార్యాలయం నుండి కొంత మంది సిబ్బంది, డిపెండెంట్లను ఉపసంహరించుకుంటున్నట్లు బ్రిటన్ తెలిపింది, దౌత్యవేత్తల కుటుంబ సభ్యులను విడిచిపెట్టమని అమెరికా కోరిన ఒక రోజు తర్వాత ఈ ప్రకటన చేసింది.
కాగా, “రష్యా సైనిక చర్య ఎప్పుడైనా జరుగవచ్చు ” అని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. అలాంటి ఆకస్మిక పరిస్థితుల్లో అమెరికన్ పౌరులను ఖాళీ చేసే పరిస్థితి ఉండదని, కాబట్టి ప్రస్తుతం ఉక్రెయిన్లో ఉన్న అమెరికా పౌరులు ఆ దేశాన్ని వీడేందుకు ప్లాన్ చేసుకోవాలని సూచించింది.
మరోవైపు ఉక్రెయిన్పై దాడి చేయవద్దని అమెరికా, యూరోపియన్ యూనియన్లు రష్యాను హెచ్చరించాయి. “మునుపెన్నడూ చూడని” ఆర్థిక ఆంక్షలు విధించడానికి ఐరోపా యూనియన్ సిద్ధంగా ఉందని డెన్మార్క్ తెలిపింది.
అయితే ఉక్రెయిన్పై తాము దాడికి సిద్ధంగా ఉన్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని రష్యా ఖండించింది. అక్కడి పరిస్థితిని నాటో మరింత జటిలం చేస్తున్నదని ఆరోపించింది. కాగా, ఉక్రెయిన్ అంశంపై అమెరికా, రష్యా మధ్య శుక్రవారం జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో తమ లిఖిత పూర్వక డిమాండ్లపై ప్రతిస్పందన కోసం రష్యా వేచి చూస్తున్నది. ఉక్రెయిన్ సమీపంలో ఇప్పటికే లక్ష బలగాను మోహరించింది.