ఎడిన్బర్గ్: సుమారు 5000 ఏళ్ల నాటి పురాతన సమాధిలో 14 అస్థిపంజరాలను (Skeletons) పురావస్తు నిఫుణులు కనుగొన్నారు. స్త్రీ, పురుషులతోపాటు పిల్లలకు చెందినవిగా పేర్కొన్నారు. అలాగే రాతి యుగానికి చెందిన కొన్ని వస్తువులు కూడా ఈ తవ్వకాల్లో బయటపడ్డాయని వెల్లడించారు. స్కాట్లాండ్లోని ప్రధాన ఓర్కినీ ద్వీపంలోని హోల్మ్లో ఇవి బయటపడ్డాయి. నేషనల్ మ్యూజియమ్స్ స్కాట్లాండ్, కార్డిఫ్ విశ్వవిద్యాలయం నిపుణుల సహకారంతో పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపారు. నియోలిథిక్ సైట్ ప్రాంతంలో 5000 ఏళ్ల నాటి పెద్ద సమాధిని కనుగొన్నారు. శిథిలావస్థలో ఉన్న ఈ సమాధిలో 14 అస్థిపంజరాలు ఉన్నాయని తెలిపారు. డీఎన్ఏ, ఐసోటోప్ విశ్లేషణ ద్వారా వారి గురించి తెలుసుకుంటామని చెప్పారు.
కాగా, స్థానిక వాలంటీర్లు, సెంట్రల్ లంకేషైర్ వర్సిటీకి చెందిన విద్యార్థులతో కలిసి కుండలు, రాతి పనిముట్లు, ఎముక వస్తువులు వంటి వాటిని కూడా ఈ పెద్ద సమాధిలో కనుగొన్నారు. నేషనల్ మ్యూజియమ్స్ స్కాట్లాండ్కు చెందిన డాక్టర్ హ్యూగో ఆండర్సన్, వైమార్క్, కార్డిఫ్ ప్రొఫెసర్ విక్కీ కమ్మింగ్స్ నేతృత్వంలో మూడు వారాలపాటు ఇక్కడ తవ్వకాలు జరిగాయి. 15 మీటర్ల (49 అడుగులు) వ్యాసం కలిగిన రాతి కట్టడం, 7 మీటర్ల పొడవున్న (23 అడుగులు) మార్గాన్ని కనుగొన్నారు.
మరోవైపు రాత్రి కట్టడం మధ్యలో ఒక రాతి గది ఉందని, దీని చుట్టూ ఆరు చిన్నవి ఉన్నాయని పురావస్తు శాస్త్రవేత్తలు తెలిపారు. ఓర్కినీలో చిన్న స్థాయిలో జరిపిన తవ్వకాల్లో ఇంత పెద్ద సమాధి బయటపడుతుందని తాము ఊహించలేదని డాక్టర్ హ్యూగో ఆండర్సన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.