దుబాయ్: అమెరికా-ఇజ్రాయెల్ దళాలు జరిపిన దాడిలో ఇరానీ కొత్త సుప్రీంనేత మొజ్తాబా ఖమేనీ(Mojtaba Khamenei) గాయపడ్డ విషయం తెలిసిందే. అయితే అతనికి ముఖానికి, కాళ్లకు తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. మొజ్తాబా ముఖం పూర్తిగా దెబ్బతిన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. ఫిబ్రవరి 28వ తేదీన టెహ్రాన్పై జరిగిన వైమానిక దాడిలో ఇరాన మాజీ సుప్రీం నేత అయుతుల్లా అలీ ఖమేనీ మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే అదే దాడిలో మొజ్తాబా ఖమేనీ గాయపడ్డారు.
యుద్ధ పరిణామాల నేపథ్యంలో ఇరానీ సుప్రీంనేతగా బాధ్యతలు తీసుకున్న మొజ్తాబా ఖమేనీ.. ఇంకా గాయాలు నుంచి కోలుకుంటున్నట్లు అతనికి సన్నిహితంగా ఉన్న ముగ్గురు వ్యక్తులు తెలిపారు. దాడిలో మొజ్తాబా ముఖం చాలా వరకు దెబ్బతిన్నదని, అలాగే ఓ కాలుకు తీవ్ర గాయమైనట్లు ఆ ముగ్గురు వెల్లడించినట్లు తెలుస్తోంది. గాయాల నుంచి కోలుకుంటున్న 56 ఏళ్ల మొజ్తాబా.. ఆ వ్యక్తుల ప్రకారం మెంటల్గా చాలా షార్ప్గా ఉన్నట్లు తెలిసింది. సీనియర్ అధికారులతో మొజ్తాబా ఆడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్నట్లు తెలిసింది.
కీలక నిర్ణయాత్మక అంశాల్లోనూ అతను తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నట్లు తెలిపారు. ఇజ్రాయెల్-అమెరికా దళాలతో జరుగుతున్న యుద్ధంతో పాటు వాషింగ్టన్ ప్రతినిధులతో జరుగుతున్న శాంతి చర్చలను కూడా మొజ్తాబా అడిగి తెలుసుకుంటున్నట్లు చెబుతున్నారు. సుప్రీంనేతగా ఎన్నికైన మొజ్తాబా.. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత మళ్లీ పరిపాలన కొనసాగిస్తారా లేదా అన్న అంశం అస్పష్టంగానే ఉంది.