ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని మియాన్వాలీ వైమానిక క్షేత్రం(Mianwali airbase )పై జరిగిన దాడిలో.. 9 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు ఆ దేశ ఆర్మీ ప్రకటించింది. ఇవాళ తెల్లవారుజామున ఎయిర్బేస్పై మిలిటెంట్లు విరుచుకుపడ్డారు. అయితే భద్రతా దళాలు ఆ అటాక్ను తిప్పికొట్టాయి. ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన ఆర్మీ.. ఉగ్రవాదులను చంపేసింది. పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన సామాగ్రికి ఎటువంటి నష్టం జరగలేదని, అయితే ప్రస్తుతం వినియోగంలో లేనటువంటి విమానాలను ధ్వంసం చేశారని ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది. ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు తొలుత ఇవాళ ఉదయం ఆర్మీ ఓ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. తెహ్రీక్ ఇ జిహాద్ పాకిస్థాన్ గ్రూపునకు చెందిన ఉగ్రవాదులు ఎయిర్బేస్పై దాడికి దిగి ఉంటారని అంచనా వేస్తున్నారు. తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్తో ఆ సంస్థకు అనుబంధం ఉన్నట్లు భావిస్తున్నారు.