హైదరాబాద్: ఉక్రెయిన్లో దాడులను రష్యా ఉధృతం చేసింది. రేవుపట్టణమైన మరియుపోల్ (Mariupol), వోల్నోవాఖ నగరాలను రష్యన్ బలగాలు దిగ్బంధించాయి. రెండు పట్టణాలను ఆక్రమించుకునేందుకుగాను నలుదిశలా బాంబుల వర్షం కురిపిస్తూ దూసుకెళ్తున్నాయి. ఎయిర్పోర్టులతోపాటు అన్ని ప్రాంతాల్లో బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. కాగా, పౌరుల తరలింపుణకు కాల్పుల విరణ పాటిస్తామని చెప్పిన రష్యా.. మాటప్పిందని మరియుపోల్ మేయర్ వదిమ్ బాయ్చెంకో ఆరోపించారు.
ఉక్రెయిన్ నుంచి పౌరుల తరలింపునకు రష్యా కాల్పుల విరమణ ప్రకటించింది. మరియుపోల్, వోల్నోవాఖ నగరాల్లో యుద్ధ క్షేత్రం నుంచి పౌరులను తరలింపునకు అవకాశం కల్పిస్తున్నామని, ఐదున్నర గంటలపాటు కాల్పులు విరమణ పాటిస్తామని రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. దీంతో మరియుపోల్ నుంచి ప్రజల తరలింపునకు బస్సులు, రైళ్లను సిద్ధం చేసుకున్నామని మేయర్ వదిమ్ చెప్పారు.
అయితే గంటల్లోనే రష్యా మళ్లీ కాల్పులు ప్రారంభించింది. నగరాన్ని నిర్బంధించి.. హ్యుమానిటేరియన్ కారిడార్కు నిరాకరించినట్లు తెలిపారు. ఇప్పటికే నగరంలో నీరు, విద్యుత్తు సౌకర్యం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రష్యన్ బలగాలు నగరంపై బాంబుల వర్షం కురిపిస్తున్నాయని వెల్లడించారు. నివాస సముదాయాలపై కూడా దాడి చేస్తున్నదని తెలిపారు. నాలుగు లక్షల మందికిపైగా నగరపౌరులను బందీలుగా చేసిందని ఆరోపించారు.