పారిస్: గ్రెనేడ్లు, బాంబులతో కూడిన జాకెట్ ధరించిన ఒక వ్యక్తి ఇరాన్ రాయబార కార్యాలయంలోకి ప్రవేశించాడు. తనను తాను పేల్చుకుంటానని బెదిరించాడు. దీంతో ఇరాన్ కాన్సులేట్ కార్యాలయం వద్దకు భారీగా భద్రతా సిబ్బంది చేరుకున్నారు. ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్లో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో అనుమానిత వ్యక్తి ఇరాన్ కాన్సులేట్ (Iran consulate) వద్ద కనిపించాడు. గ్రెనేడ్లు, పేలుడు పదార్థాలు ఉన్న జాకెట్ను అతడు ధరించాడు. తనను తాను పేల్చుకుంటానని బెదిరించాడు.
కాగా, ఈ విషయం తెలిసిన వెంటనే భద్రతా సిబ్బంది ఇరాన్ కాన్సులేట్ చుట్టూ మోహరించారు. అనుమానిత వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతడు ఉగ్రదాడికి ప్రయత్నించాడా? లేక మరో కారణంతో ఇలా ప్రవర్తించాడా? అన్నది దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన నేపథ్యంలో ఇరాన్ రాయబార కార్యాలయం ప్రాంతంలోని రెండు మెట్రో లైన్స్లో రాకపోకలను నిలిపివేశారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో జరిగిన ఈ సంఘటన ఫ్రాన్స్లో కలకలం రేపింది.