లండన్: మగవారికి గర్భనిరోధక మాత్రలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. బ్రిటన్లోని స్కాట్లాండ్కు చెందిన డుండి విశ్వవిద్యాలయం పరిశోధకులు దీనిపై ప్రయోగాలు చేస్తున్నారు. బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ నుంచి £ 1.2 మిలియన్ల (రూ.12.37 కోట్ల) నిధుల ప్రోత్సాహాన్ని వారు పొందనున్నారు. దీంతో పురుషుల గర్భనిరోధక మాత్రల అభివృద్ధిపై పరిశోధనలు మరింతగా ఊపందుకోనున్నాయి.
సురక్షితమైన, ప్రభావవంతమైన పురుష గర్భనిరోధక ఔషధాన్ని అభివృద్ధి చేసేందుకు పరిశోధనలు చేస్తున్న అనేక సంస్థలలో డుండి విశ్వవిద్యాలయం ఒకటి. అయితే, చాలా సంవత్సరాలుగా ఈ దిశగా ఎలాంటి పురోగతి లేదు. మానవ స్పెర్మ్ బయాలజీని సరిగా అర్థం చేసుకోలేకపోవడం, వీర్య కణాల కీలక విధులకు సంబంధించి సరైన అధ్యయనాలు లేకపోవడం వల్ల ఈ ప్రయత్నాలు ముందుకుసాగలేదు.
కాగా, సూక్ష్మదర్శిని, ఇమేజ్-ప్రాసెసింగ్ సాధనాలను ఉపయోగించే సూక్ష్మీకరణ సమాంతర పరీక్ష వ్యవస్థను ఈ యూనివర్శిటీ పరిశోధకుల బృందం అభివృద్ధి చేసింది. స్పెర్మ్ వేగవంతమైన కదలికను ఇది ఖచ్చితమైన మార్గంలో పర్యవేక్షిస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ తరుణంలో బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ నుంచి నిధులు అందనుండటంపై డుండీ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్లో పునరుత్పత్తి మెడిసిన్ ప్రొఫెసర్ క్రిస్ బారట్ హర్షం వ్యక్తం చేశారు.
కండోమ్ అభివృద్ధి తర్వాత పురుషుల గర్భనిరోధక రంగంలో గణనీయమైన మార్పు లేదని క్రిస్ తెలిపారు. దీంతో అవాంఛిత గర్భాల నుండి రక్షించే భారం చాలా వరకు మహిళలపై పడుతున్నదని అన్నారు. ఈ అసమానతను పరిష్కరించాలని తాము ఆశిస్తున్నామని చెప్పారు. తదుపరి పరిశోధనల కోసం బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ నుంచి మునుపటి రౌండ్ నిధులు అందనుండటంపై ఆయన ధన్యవాదాలు తెలిపారు.
పురుషుల సంతానోత్పత్తి పరిశోధనలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన తమ నైపుణ్యం, ఔషధం రూపకల్పనలో తమ జ్ఞానాన్ని ఈ పరిశోధనను కొనసాగించడానికి వినియోగిస్తామని క్రిస్ తెలిపారు. రెండేండ్ల ప్రాజెక్టు సమయం ముగిసేనాటికి తొలి దశలో భాగంగా మగవారి గర్భనిరోధక మాత్రలను అభివృద్ధి చేసే అధిక నాణ్యత సమ్మేళనాన్ని గుర్తించాలనుకుంటున్నామని చెప్పారు. ఈ రంగంలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అవుతుందని, పురుషుల గర్భనిరోధకంలో కొత్త శకాన్ని ఆవిష్కరిస్తుందని అన్నారు.