షాంఘై : చైనా ఆర్థిక నగరం షాంఘై కరోనా మహమ్మారి నుంచి కోలుకుటున్నది. ప్రస్తుతం కరోనా అదుపులోకి వస్తుండడంతో ఇప్పటికే పలు ఆంక్షలు సడలించిన అధికారులు.. వచ్చే నెల జూన్ ఒకటో తేదీ నుంచి పూర్తిస్థాయి లాక్డౌన్ను ఎత్తివేసేందుకు నిర్ణయించారు. ఒమిక్రాన్ వేరియంట్ విజృంభణతో ఆర్థిక నగరం షాంఘై వణికిపోయింది. వైరస్ కట్టడికి కఠిన లాక్డౌన్ అమలు చేయడంతో ప్రజలు నిత్యావసరాలత కొరతతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆరువారాలుగా కొనసాగుతున్న లాక్డౌన్
కారణంగా చైనా ఆర్థిక వ్యవస్థ భారీగా దెబ్బతిన్నది.
ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా రెండున్నర కోట్ల జనాభా ఉన్న షాంఘై నగరంలో మార్చి చివరి వారంలో లాక్డైన్ విధించారు. వైరస్ ఉధృతిని దృష్టిలో పెట్టుకొని ఆంక్షలను పొడిగిస్తూ వచ్చింది. అయితే, వైరస్ నియంత్రణకు తీసుకున్న కఠిన చర్యలతో కేసులు తగ్గుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. మరో వైపు ఇప్పటికే పలు ఆంక్షలను సడలించినట్లు డిప్యూటీ మేయర్ జోంగ్ మింగ్ పేర్కొన్నారు. జూన్ ఒకటి నుంచి పూర్తిస్థాయి లాక్డౌన్ ఎత్తివేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కేసులు పెరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.