వాషింగ్టన్, అక్టోబర్ 22: పళ్లెం లాంటి వస్తువు ఆకాశంలో బొంగరంలా తిరుగుకుంటూ వెళ్తుంది.. అది ఒక్క చోట ఆగదు.. దాని గురించి తెలుసుకొందామంటే క్షణాల్లో మాయమైపోతుంది.. ఇలా ఒక్కసారి జరిగితే ఏమోలే! అని ఊరుకోవచ్చు. కానీ, దశాబ్దాలుగా ఈ పళ్లాలు (అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్-యూఎఫ్వోలు) భూమి చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. అసలేంటివి? అని ప్రశ్నిస్తే అది ప్రశ్నగానే మిగిలిపోతుంది.
గొప్ప గొప్ప ఖగోళ శాస్త్రవేత్తల వద్ద కూడా దీనికి సమాధానం లేదు. సరే.. అందరూ ఊహించుకొంటున్నట్టుగా అవి గ్రహాంతరవాసులా! అంటే అదీ తెలియదు. సర్వ మానవాళికి అంతుచిక్కకుండా భూమి చుట్టూ చక్కర్లు కొడుతున్న యూఎఫ్వోల నిగ్గు తేల్చేందుకు నాసా నడుం బిగించింది. అవేంటి? ఎక్కడి నుంచి వస్తున్నాయ్? అని తెలుసుకొనేందుకు 16 మందితో ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం 9 నెలల పాటు యూఎఫ్వోలపై పరిశోధన చేసి.. నివేదికను సమర్పించనుంది. ఈ నెల 24 నుంచే అన్వేషణ మొదలుపెట్టనున్నారు.
2000 సంవత్సరం నుంచి తరచూ..
20 ఏండ్లుగా యూఎఫ్వోలు ఎక్కువగా భూమివైపు వస్తున్నాయి. 2000వ సంవత్సరం నుంచి వీటి రాకపోకలు ఎక్కువయ్యాయి. మొన్నకి మొన్న పసిఫిక్ మహా సముద్రంపై వీటిని గుర్తించామని కొందరు పైలట్లు వెల్లడించారు. రెండు నెలలుగా ఇది జరుగుతున్నదని, తన కంటే ఎక్కువ ఎత్తులో ఎగిరిన పలు వస్తువులను గుర్తించానని ఓ పైలట్ తెలిపారు. కానీ, అవేమిటనేది స్పష్టత రాలేదు.