పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు గడ్డుకాలం ప్రారంభమైంది. ఆయనకు పాక్ ప్రతిపక్షాలన్నీ కలిసి తాజాగా ఓ అల్టిమేటం జారీ చేశాయి. ఐదు రోజుల్లోగా రాజీనామా అయినా చేయాలి, లేదంటే అవిశ్వాస తీర్మానం ఎదుర్కోడానికి రెడీ అయినా ఉండాలంటూ ఆప్షన్లు ఇచ్చాయి. ఇదే విషయంపై పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు బిలావల్ భుట్టో మాట్లాడుతూ.. దేశంలో స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలని డిమాండ్ చేశారు. ప్రధాని ఇమ్రాన్ ముందు రెండే రెండు మార్గాలున్నాయని, ప్రధాని పదవికి రాజీనామా అయినా చేయాలి.. లేదంటే అవిశ్వాసాన్నైనా ఎదుర్కోవాలంటూ సవాల్ విసిరారు. అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టే విషయంలో ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైనే ఉన్నాయన్నారు. దేశంలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోతోందని, ధరలు కూడా పెరిగాయని, దీనిపై తాము పోరాడతామని బిలావల్ భుట్టో ప్రకటించారు.
ప్రధాని ఇమ్రాన్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని సంచలన నిర్ణయం దిశగా కదులుతున్నాయి. పాక్ నేషనల్ అసెంబ్లీలో మొత్తం 342 సీట్లున్నాయి. సర్కార్ను ఏర్పాటు చేయాలంటే 177 సీట్లు కావాలి. ప్రస్తుతం ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దగ్గర 156 సీట్లున్నాయి. అందునా.. మద్దతిచ్చే పార్టీలను కలుపుకొనే. ఇప్పుడు ఈ పార్టీలు తమ మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటిస్తే.. ఇమ్రాన్ ప్రభుత్వం కుప్పకూలినట్టే. లెక్క ప్రకారం పాక్లో 2023లో ఎన్నికలు జరగాల్సి వుంది. అయితే తిరిగి ఇమ్రాన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా? అంటే సంశయమే. గతంలోనే ప్రభుత్వ ఏర్పాటులో దాదాపుగా 20 సీట్లు తక్కువయ్యాయి. అతి కష్టం మీద ఇతరుల మద్దతుతో ఇమ్రాన్ మిత్రపక్షాల మద్దతు కూడగట్టి, ప్రభుత్వం ఏర్పాటు చేశారు.