కొలంబో: దేశాన్ని విడిచి వెళ్లొద్దని శ్రీలంక మాజీ ప్రధాని మహింద రాజపక్సేను ఆ దేశ సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. మహిందతోపాటు మాజీ ఆర్థిక మంత్రి బాసిల్ రాజపక్సే, ఇద్దరు సెంట్రల్ బ్యాంకు మాజీ గవర్నర్లు, మరో అధికారి దేశాన్ని విడిచి వెళ్లకుండా నిషేధం విధించింది. కోర్టు అనుమతి లేకుండా ఈ నెల 28 వరకు దేశాన్ని విడిచి వెళ్లవద్దని ఆదేశించింది. ఈ మేరకు వారిపై సుప్రీంకోర్టు నిషేధం విధించింది. శ్రీలంకను తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో నెట్టేసి దేశం నుంచి పారిపోయిన గొటబయ రాజపక్సే, మాల్దీవుల నుంచి సింగపూర్ చేరుకున్న తర్వాత గురువారం తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. కాగా, 71 ఏళ్ల మాజీ ఆర్థిక మంత్రి బాసిల్ రాజపక్సే గత వారం దేశం నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. కొలంబో ఎయిర్పోర్ట్కు వెళ్లిన ఆయనను వీఐపీ టెర్మినల్ వద్ద అడ్డుకున్న సిబ్బంది వెనక్కి పంపారు.
ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని మహింద రాజపక్సే, మాజీ ఆర్థిక మంత్రి బాసిల్ రాజపక్సేతోపాటు దేశ ఆర్థిక సంక్షోభానికి కారణమైన కీలక అధికారులు దేశం విడిచి పారిపోకుండా నిషేధం విధిస్తూ మధ్యంతర ఆదేశాలు జారీ చేయాలంటూ శ్రీలంక స్విమ్మర్, కోచ్ జూలియన్ బోలింగ్ ఆ దేశ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో శ్రీలంక మాజీ ప్రధాని మహింద రాజపక్సే, మాజీ ఆర్థిక మంత్రి బాసిల్ రాజపక్సే, ఇద్దరు సెంట్రల్ బ్యాంకు మాజీ గవర్నర్లు, మరో ముఖ్య అధికారి ఈ నెల 28 వరకు దేశం విడిచి వెళ్లకుండా ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం నిషేధం విధించింది. ఈ మేరకు శుక్రవారం మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.