న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: కరోనా విజృంభణ నేపథ్యంలో వివిధ రాష్ర్టాల సీఎంలతో ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా కేజ్రీవాల్ సర్కారు వ్యవహరించిన తీరు వివాదానికి దారి తీసింది. అంతర్గత సమావేశాన్ని ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యక్ష ప్రసారం చేయడాన్ని ప్రధాని ఆక్షేపించారు. ఇది సంప్రదాయానికి, ప్రొటోకాల్కు విరుద్ధమన్నారు. ఇది సరికాదని, సంయమనంతో వ్యవహరించాలని స్పష్టంచేశారు. దీంతో సీఎం కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ అధికారులు కూడా ఢిల్లీ ప్రభుత్వ వైఖరిని విమర్శించారు. కేజ్రీవాల్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం నుంచి తీవ్ర విమర్శలు రావడంతో సీఎం కార్యాలయం (సీఎంవో) విచారం వ్యక్తం చేసింది. ‘సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయకూడదని కేంద్రం నుంచి మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. అందుకే అలా చేశాం. రహస్య సమాచారం లేని ప్రజా ప్రాముఖ్యత ఉన్న సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేసిన సందర్భాలున్నాయి. ఏదేమైనా, అసౌకర్యానికి చింతిస్తున్నాం’ అని సీఎంవో పేర్కొన్నది. అంతకుముందు సమావేశంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘ఆక్సిజన్ కొరతతో ఏదైనా పెద్ద విషాదం జరుగుతుందేమోనని భయంగా ఉన్నది. అదే జరిగితే మనల్ని మనం ఎన్నటికీ క్షమించుకోలేం. చేతులు జోడించి వేడుకుంటున్నా. ఢిల్లీకి వచ్చే ఆక్సిజన్ ట్యాంకర్లకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడండి’ అని కోరారు. సంక్షోభాన్ని పరిష్కరించేందుకు జాతీయ ప్రణాళిక అవసరమన్నారు.
ఆక్సిజన్ ట్యాంకర్ల రవాణా సమయాన్ని తగ్గించేందుకు రైల్వేను, వాయుసేనను రంగంలోకి దించినట్టు ప్రధాని మోదీ తెలిపారు. అన్ని రాష్ర్టాలు కలసి పనిచేయాలని, ఆక్సిజన్ సరఫరాకు అడ్డంకులు సృష్టించొద్దని సూచించారు.