మియామి: అమెరికాలో ఓ మహిళ మర్డర్ జరిగిన ప్రదేశంలో రిపోర్టింగ్కు వెళ్లిన ఓ టీవీ జర్నలిస్టు(TV Journalist)ను ఉన్మాది కాల్చి చంపాడు. ఈ ఘటన ఫ్లోరిడా(Florida)లోని ఓర్లాండ్లో జరిగింది. ఆ ఉన్మాదే అంతకముందు అక్కడ ఓ మహిళను చంపినట్లు గుర్తించారు. రిపోర్టర్ను కాల్చి చంపిన తర్వాత అతను 9 ఏళ్ల అమ్మాయిని కూడా హత్య చేశాడు. 19 ఏళ్ల కీత్ మెల్విన్ మోసెస్(Keith Melvin Moses) ఈ హత్యలకు పాల్పడినట్లు ఆరెంజ్ కౌంటీ షెరీఫ్ తెలిపారు. కీత్ను కస్టడీలోకి తీసుకున్నామని, ఆ కాల్పులకు అతనే బాధ్యుడని తేల్చారు.
ఓర్లాండ్లోని పైన్ హిల్స్లో ఈ మర్డర్ ఘటనలు జరిగాయి. తొలుత ఆ ప్రాంతంలో 20 ఏళ్ల ఓ మహిళ హత్యకు గురైంది. ఉదయం 11 గంటలకు ఆ మర్డర్ జరిగినట్లు పోలీసులు చెప్పారు. అయితే ఆ మర్డర్ న్యూస్ను కవర్ చేసేందుకు స్పెక్ట్రమ్ న్యూస్ 13కు చెందిన బృందం అక్కడకు వచ్చింది. నాలుగు గంటల సమయంలో కీత్ మెల్విన్ అక్కడకు వచ్చాడు. స్పెక్ట్రమ్ ఛానల్ కెమెరా ఆపరేటర్తో పాటు రిపోర్టర్పై కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల్లో రిపోర్టర్ మరణించగా.. కెమెరా ఆపరేటర్ గాయపడ్డారు.
టీవీ రిపోర్టర్ను చంపిన తర్వాత ఆ సాయుడు సమీపంలో ఉన్న ఓ ఇంటికి వెళ్లి కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల్లో ఓ మహిళ గాయపడగా, 9 ఏళ్ల చిన్నారి మృతిచెందింది. హత్యలకు కారణమైన కీత్ను అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు.