MS Butina : అమెరికా తయారు చేసిన దీర్ఘశ్రేణి ఆయుధాలను రష్యాపై వాడేందుకు కీవ్కు అనుమతిచ్చి బైడెన్ కార్యవర్గం ప్రమాదకర నిర్ణయం తీసుకున్నదని రష్యాలోని డ్యూమా సభ్యురాలు మారియా బూటినా అన్నారు. ఆ నిర్ణయాన్ని మూడో ప్రపంచ యుద్ధం వైపు నెట్టే చర్యగా అభివర్ణించారు. పదవిలో ఉన్నంత కాలం బైడెన్ కార్యవర్గం ఉద్రిక్తతలను గరిష్ఠస్థాయిలో రాజేస్తుందని, ట్రంప్ వచ్చాక ఈ నిర్ణయాలను ఉపసంహరించుకుంటారని ఆశిస్తున్నానని, మూడో ప్రపంచ యుద్ధాన్ని ఎవరూ కోరుకోవడంలేదని ఆమె పేర్కొన్నారు.
అమెరికాలో రష్యా ఏజెంటుగా పనిచేస్తోందనే ఆరోపణలపై బూటినాను జైల్లో పెట్టారు. దాదాపు 15 నెలలపాటు ఆమె జైల్లో గడిపారు. ప్రస్తుతం ఆమె యునైటెడ్ రష్యా పార్టీ తరఫున డ్యూమా సభ్యురాలిగా ఉన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధగతిని మార్చేలా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కీవ్కు తాము అందిస్తున్న దీర్ఘ శ్రేణి క్షిపణులను (ఆర్మీ టాక్టికల్ మిస్సైల్ సిస్టమ్) రష్యా భూభాగంపై దాడికి వినియోగించుకునేందుకు అనుమతిస్తున్నట్లు ప్రకటించారు.
ఈ విషయాన్ని న్యూయార్క్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. ఈ నిర్ణయంపై రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ ఇప్పటివరకు స్పందించలేదు. సెప్టెంబర్ 12న పుతిన్ మాట్లాడుతూ.. రష్యాపై దీర్ఘశ్రేణి ఆయుధాల వినియోగాన్ని పశ్చిమ దేశాలు అంగీకరిస్తే.. నాటో, అమెరికా, ఐరోపా దేశాలు నేరుగా యుద్ధంలో పాల్గొన్నట్లే భావిస్తామని తెలిపారు. నాటో సైనిక, సాయుధ సంపత్తిని లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో బైడెన్ నిర్ణయం కలకలం రేపుతోంది.