టోక్యో: జపాన్ ప్రభుత్వం ఓ దుస్సాహసానికి తెగబడుతోంది. ఆ దేశంలోని ఫుకుషిమా అణు రియాక్టర్లోని పది లక్షలకుపైగా టన్నుల వృథా నీటిని సముద్రంలోకి వదులుతామని మంగళవారం ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై పొరుగు దేశాలు, జపాన్ మత్స్యకారుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నా.. ప్రభుత్వం మాత్రం దీనిపై ముందడుగు వేస్తోంది. ఈ ప్రక్రియ ప్రారంభం కావడానికి వచ్చే కొన్నేళ్లు పట్టడంతోపాటు పూర్తి కావడానికి కొన్ని దశాబ్దాలు పట్టనుంది. అయినా జపాన్ ప్రభుత్వ ఈ చర్యపై ఇంటా, బయటా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
జపాన్ మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది. ఈ నీటిని పూర్తిగా ప్రాసెస్ చేశామని, ఇందులో అసలు రేడియోయాక్టివ్ అంశాలు అసలు లేవని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ చర్యను ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఏఈఏ) సమర్థించడం గమనార్హం. ప్రపంచంలోని న్యూక్లియర్ ప్లాంట్ల నుంచి వృథా నీటిని పంపినట్లే ఇక్కడా జరుగుతోందని ఐఏఈఏ చెప్పింది.
ఈ న్యూక్లియర్ ప్లాంట్ను డీకమిషన్ చేసే ప్రక్రియలో భాగంగా వృథా నీటిని సముద్రంలోకి వదలడం తప్పదని జపాన్ ప్రధాని యోషిహిడే సుగా తన మంత్రివర్గ సమావేశంలో స్పష్టం చేశారు. నీటి సురక్షిత స్థాయిలను పరీక్షించిన తర్వాతే వదులుతామని తెలిపారు. 2011లో సునామీ వచ్చిన తర్వాత 1.25 మిలియన్ టన్నుల నీళ్లు ఇక్కడి ట్యాంకుల్లో నిలిచిపోయాయి. ఇవే కాకుండా ప్లాంట్ను చల్లార్చడానికి ఉపయోగించే నీళ్లు, వర్షం, భూగర్భ జలాలు కూడా ఉన్నాయి.
ప్రతి రోజూ కొన్ని టన్నుల నీటిని పంప్ చేసి, ఫిల్టర్ చేసి, అందులోని రేడియా ధార్మిక పదార్థాలను తొలగించి సముద్రంలోకి వదులుతారు. అయితే ఈ నీటి వల్ల సముద్రంలోని మత్స్య సంపదకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని జపాన్ మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నీటిని సముద్రంలోకి విడుదల చేయడానికి అంగీకరించేదే లేదని స్పష్టం చేస్తున్నారు.
అటు సౌత్ కొరియా, చైనా కూడా జపాన్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. అయితే అమెరికా మాత్రం ఈ విషయంలో జపాన్కు మద్దతివ్వడం గమనార్హం. అంతర్జాతీయంగా అంగీకరించిన న్యూక్లియర్ సేఫ్టీ ప్రమాణాలను జపాన్ పాటిస్తున్నట్లు అమెరికా చెప్పింది. ఈ నీటిని ఎలా వదిలించుకోవాలా అని జపాన్ కొన్నేళ్లుగా ఆలోచనలు చేస్తూనే ఉన్నది.