Jackma in Europe | జాక్మా.. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అలీబాబా.. దాని అనుబంధ ఫిన్టెక్ సంస్థ ఆంట్గ్రూప్ స్థాపనతో చైనాలోని శక్తమంతుల్లో ఒకరు.. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు మీడియాకూ.. అంతర్జాతీయ సమాజానికీఅ దూరంగా ఉన్న జాక్ మా.. తాజాగా యూరప్లోని ఆస్ట్రియా, నెదర్లాండ్స్తోపాటు స్పానిష్-మాల్లోర్కాదీవుల్లో కనిపించారని వార్తలొచ్చాయి. వ్యాపార సంస్థల లావాదేవీలపై చైనా ప్రభుత్వ నియంత్రణపై నోరు 2020 చివర్లో పారేసుకున్న జాక్మా.. ఆయన అనుబంధ ఆలీబాబా.. ఆంట్ గ్రూప్లపై రెగ్యులేటరీ సంస్థలు కొరడా ఝుళిపించాయి. ఆంట్ గ్రూప్ ఐపీవోను ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. చైనా నియంత్రణ సంస్థలు కఠిన తరం చేశాయి.
అయితే అలీబాబా గ్రూప్ సీఈవోగా 2013లో, చైర్మన్గా 2019లో వైదొలిగారు. ఆంట్ గ్రూప్లో తన వాటాను 8.8 శాతానికి తగ్గించుకుంటానని 2014లోనే జాక్మా ప్రకటించారు. జాక్మా వైదొలగనున్నట్లు ప్రకటించడం.. ఆంట్ గ్రూప్ బోర్డు విధి విధానాలను ఖరారు చేయడంలో జాప్యం వల్ల దాని ఐపీవో వాయిదా పడిందని సమాచారం.
అయితే, వ్యాపార లావాదేవీలపై ఆంక్షల పట్ల విమర్శలు చేసిన జాక్మాను బయటి ప్రపంచానికి కనిపించొద్దని చైనా సర్కార్ ఆదేశించింది. విదేశీ పర్యటనకు వెళ్లొద్దని, మీడియా ముందుకు రావొద్దని జీ జిన్పింగ్ ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగానే వ్యవహరించారు జాక్మా.. అప్పటివరకు ప్రపంచ బిలియనీర్లలో ఒకడిగా ఉన్న జాక్ మా పేరు కనుమరుగైంది. రెండు నెలల క్రితం జాక్మాపై చైనా సర్కార్ ఆంక్షలు విధించిందన్న వార్తలతో 26 బిలియన్ల డాలర్ల విలువ గల అలీబాబా షేర్లు నష్టపోయాయి. తాజాగా ఆంట్ గ్రూప్లో తన పెట్టుబడులను ఉపసంహరించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు జాక్మా ప్రకటించిన నేపథ్యంలో జీ జిన్పింగ్ సర్కార్.. ఆయనకు కాస్త వెసులుబాటు కల్పించినట్లు తెలుస్తున్నది. దాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న జాక్మా.. తాజా యూరప్ దేశాల పర్యటనలో సుస్థిర వ్యవసాయ విధానాలపై అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం.
ఆంట్ గ్రూప్ సారధ్య బాధ్యతలను జాక్మా వదులుకుంటారని ఆ సంస్థ ఇటీవల రెగ్యులేటరీ సంస్థలకు ఇచ్చిన ఫైలింగ్లో తెలిపింది. జాక్మా తన ప్రణాళిక వివరాలను చైనా అధికారులకు, సెంట్రల్ బ్యాంక్కూ వివరించారని సమాచారం. ఈ ప్లాన్ ప్రకారం తన వాటాలను ఆంట్ గ్రూప్లోని ఇతర ఎగ్జిక్యూటివ్లకు బదిలీ చేస్తారు. ఆంట్ గ్రూప్ పర్యవేక్షణకు కమిటీని నియమిస్తారని తెలిసింది. అంతే కాదు ఇప్పటి వరకు ఆంట్ గ్రూప్లో జాక్మాకు ఉన్న వాటా 50.52 శాతాన్ని 8.8 శాతానికి పరిమితం చేసుకునేందుకు ఆయన సిద్ధమయ్యారు.
వాటాలను ఇతరులను బదిలీ చేయడంతోపాటు సారధ్య బాధ్యతల నుంచి జాక్మా వైదొలిగితే ఆంట్ గ్రూప్ మీద ఒత్తిడి తగ్గుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే జాక్మా.. ఆంట్ గ్రూప్ రోజువారీ కార్యకలాపాల్లో పాల్గొనడం లేదు. కనుక ఆయన తప్పుకున్నా పెద్ద ప్రభావమేమీ ఉండదని చెబుతున్నారు. ఆంట్ గ్రూప్ సారధ్యంతోపాటు సంస్థలో వాటాల నుంచి తప్పుకుంటారన్న వార్తలతో శుక్రవారం స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్లో అలీబాబా షేర్ 4 శాతం వరకు నష్టపోయింది.